ఖమ్మం : టీఆర్ఎస్కు మద్దతిచ్చేందుకు ప్రతిపక్ష పార్టీల నాయకులు, కార్యకర్తలు ముందుకు రావడం సంతోషంగా ఉందని రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ అన్నారు. ఖమ్మం కాంగ్రెస్ పార్టీకి చెందిన సుమారు 200 మంది కార్యకర్తలు గురువారం అధికార టీఆర్ఎస్ పార్టీలో చేరారు. వీరందరికీ మంత్రి గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. పార్టీ కోసం పనిచేసే కార్యకర్తలను కాంగ్రెస్ గుర్తించడం లేదన్నారు.
అభివృద్దిని అడ్డుకోవడమే జిల్లా కాంగ్రెస్ మొదటి ప్రాధాన్యంగా ఉందని మంత్రి అన్నారు. సీఎం కేసీఆర్ నేతృత్వంలోని అన్ని వర్గాల ప్రజల సంక్షేమానికి టీఆర్ఎస్ ప్రభుత్వం పాటుపడుతుందన్నారు. అందుకే ఏ ఎన్నికల్లోనైనా ప్రజలు టీఆర్ఎస్ను ఆశీర్వదిస్తున్నట్లు చెప్పారు.
కాంగ్రెస్ నాయకులు సోమనబోయిన స్వర్ణ, తోడేటి వసంత, పార్టీ టౌన్ మైనారిటీ విభాగం నాయకులు సయ్యద్ జిలానీ, షేక్ జానీ, ఎండీ కరీం, ఎస్టీ సెల్ అధ్యక్షుడు శ్రీనివాస రావు టీఆర్ఎస్లో చేరిన వారిలో ఉన్నారు. ఈ కార్యక్రమంలో సుడా చైర్మన్ బాచు విజయ్ కుమార్, నగర మేయర్ పునుకొల్లు నీరజ, టీఆర్ఎస్ పార్టీ కార్యాలయ ఇన్ఛార్జి ఆర్జేసీ కృష్ణ, కార్పొరేటర్ కమర్తాపు మురళి, జిల్లా మైనారిటీ అధ్యక్షుడు తాజుద్దీన్, ఇతర నాయకులు పాల్గొన్నారు.