న్యూఢిల్లీ: మే నెలలో చలో పార్లమెంట్కు పిలుపునిచ్చినట్లు 40 రైతుల సంఘాల వేదిక అయిన సంయుక్త కిసాన్ మోర్చా ప్రకటించింది. ర్యాలీ నిర్వహించే తేదీని త్వరలో నిర్ణయిస్తామని బుధవారం తెలిపింది. ఏప్రిల్ 10న కుండ్లి-మనేసర్-పాల్వాల్ ఎక్స్ప్రెస్ హైవేను దిగ్బంధిస్తామని పేర్కొంది. కేంద్ర ప్రభుత్వం తెచ్చిన మూడు వ్యవసాయ చట్టాలను ఉత్తరాది రాష్ట్రాల రైతులు వ్యతిరేకిస్తున్న సంగతి తెలిసిందే. పంజాబ్, హర్యానా, ఉత్తరప్రదేశ్కు చెందిన వేలాది మంది రైతులు ఢిల్లీ సరిహద్దు ప్రాంతాలైన టిక్రి, సింఘు, ఘాజీపూర్ వద్ద గత ఏడాది నవంబర్ నుంచి నిరసన తెలుపుతున్నారు.
ఇటీవల దేశవ్యాప్త బంద్ చేపట్టిన సంయుక్త కిసాన్ మోర్చా, జనవరి 26న రిపబ్లి డే రోజున నిర్వహించిన ట్రాక్టర్స్ ర్యాలీ ఢిల్లీలో హింసాత్మక ఘటనలు, చారిత్రక ఎర్రకోట ముట్టడికి దారి తీసింది. మరోవైపు కేంద్ర ప్రభుత్వం రైతు సంఘాలతో పలు దశల్లో జరిపిన చర్చలు ఎలాంటి ఫలితాన్ని ఇవ్వలేదు. కాగా, వ్యవసాయ చట్టాలపై సుప్రీంకోర్టు నియమించిన కమిటీ తన నివేదికను బుధవారం సమర్పించింది. ఈ నేపథ్యంలో నిరసనలను మరింత తీవ్రం చేయాలని సంయుక్త కిసాన్ మోర్చా నిర్ణయించింది.