PMO tweet: కాంగ్రెస్ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి, రాజ్యసభ సభ్యుడు ఆస్కార్ ఫెర్నాండెజ్ మృతిపై ప్రధాని నరేంద్రమోదీ విచారం వ్యక్తంచేశారు. ఆస్కార్ ఫెర్నాండెజ్ మరణవార్త తనను చాలా బాధించిందని పేర్కొన్నారు. ఈ విషాద సమయంలో ఆయన కుటుంబసభ్యులకు, శ్రేయోభిలాషులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నానన్నారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని పేర్కొన్నారు. ఈ విషయాన్ని ప్రధాని కార్యాలయం ట్విట్టర్ ద్వారా వెల్లడించింది.
అనారోగ్య కారణాలవల్ల ఆస్కార్ ఫెర్నాండెజ్ (80) సోమవారం మధ్యాహ్నం మృతి చెందారు. కర్ణాటక రాష్ట్రం మంగళూరులోని యెనిపోయా ఆస్పత్రిలో తుదిశ్వాస విడిచారు. గత జూలైలో ఫెర్నాండెజ్ తన ఇంట్లో యోగాసనాలు వేస్తూ ప్రమాదవశాత్తు పడిపోయారు. వెంటనే ఆయనను ఆస్పత్రికి తరలించగా పరీక్షలు చేసిన వైద్యులు మెదడులో రక్తం గడ్డ కట్టినట్లు నిర్ధారించారు. అనంతరం సర్జరీ చేసి బ్లడ్ క్లాట్ను తొలగించారు. సర్జరీ తర్వాత తీవ్ర అస్వస్థతకు గురైన ఫెర్నాండెజ్ ఇవాళ మరణించారు.