ముంబై : రిలయన్స్ అధినేత ముఖేశ్ అంబానీ ఇంటి ముందు పేలుడు పదార్ధాలు ఉన్న వాహనాన్ని నిలిపిన కేసులో ముంబై పోలీసు సచిన్ వాజేను అరెస్టు చేసిన విషయం తెలిసిందే. ఆ కేసులో ఎన్ఐఏ పోలీసులు స్పెషల్ కోర్టుకు ఛార్జిషీట్ సమర్పించారు. ఆ రిపోర్ట్లో సచిన్ వాజే ఎలా ముఖేశ్ అంబానీని బెదిరించే ప్రయత్నం చేశారో పేర్కొన్నారు. ముంబైలో బెదిరింపులకు పాల్పడి, వసూళ్లు చేయడంలో వాజే స్పెషలిస్టు. అయితే గతంలో ఓ కేసులో ఇరికిన అతన్ని.. ఉద్యోగం నుంచి తొలగించారు. 2020లో మళ్లీ పోలీసు శాఖలో చేరి అతను యధావిధిగా బెదిరింపులకు పాల్పడ్డాడు.
ముఖేశ్ అంబానీ ఇంటి ముందు పేలుడు పదార్ధాలు ఉన్న ఎస్యూవీ వాహనాన్ని పార్క్ చేసి భారీగా డబ్బలు వసూల్ చేసే ప్రయత్నం చేసినట్లు వాజేపై ఎన్ఐఏ రిపోర్ట్ ఇచ్చింది. ఈ కేసులో మరో 9 మంది నిందితులుగా ఉన్నారు. ఆంటిలియాలోని అంబానీ ఇంటి ముందు పార్క్ చేసిన వాహనం ఓనర్ మున్సూక్ హిరేన్ను కూడా వాజే హత్య చేయించినట్లు తేలింది. 16 ఏళ్ల పాటు నిశ్శబద్ధంగా ఉన్న వాజే మళ్లీ ఉద్యోగంలో చేరడంతో వసూళ్లకు పాల్పడినట్లు సీబీఐ కూడా పేర్కొన్నది.
ముకేశ్ ఇంటి ముందు స్కార్పియోను పార్క్ చేసిన కేసులో వాజే ఉగ్రవాద చర్యకు పాల్పడినట్లు ఎన్ఐఏ తన చార్జీషీట్లో పేర్కొన్నది. ఈ ఘటనకు సంబంధించి 290 పేజీల ఛార్జ్షీట్ను కోర్టుకు సమర్పించింది. సంపన్నులను భయభ్రాంతులకు గురిచేసి, వారి వద్ద నుంచి డబ్బులు వసూల్ చేయాలన్న ఉద్దేశంతో వాజే ఉన్నట్లు ఆ నివేదికలో తెలిపారు. బెదిరింపుల కేసు నుంచి బయటపడేందుకు హిరేన్ను మర్డర్ చేసినట్లు తేలింది. కిరాయి గూండాలతో హిరేన్ హత్యకు వాజే ప్లాన్ వేశాడు. నీతా అంబానీ వాహన నెంబర్ ప్లేట్ను హిరేన్కు చెందిన స్కార్పియోకు పెట్టినట్లు వాజేపై ఆరోపణలు ఉన్నాయి.