Pilot Vs Gelhot | రాజస్థాన్ సీఎం అశోక్ గెహ్లాట్ తన క్యాబినెట్ను విస్తరించడానికి కాంగ్రెస్ పార్టీ అధిష్ఠానం అనుమతించిందని సమాచారం. ఈ క్యాబినెట్ విస్తరణతో గతేడాది గెహ్లాట్పై తిరుగుబాటు ప్రకటించిన సచిన్ పైలట్కు ప్రాధాన్యం లభించనున్నట్లు తెలుస్తోంది. త్వరలో జరిగే విస్తరణలో కనీసం నలుగురు పైలట్ వర్గ ఎమ్మెల్యేలకు చోటు దక్కుతుందని వినికిడి. సచిన్ పైలట్ తిరుగుబాటు తర్వాత కాంగ్రెస్ అధిష్ఠానం అప్రమత్తమై ఇరువర్గాల మధ్య రాజీ కుదర్చడానికి ప్రయత్నించిందన్న సంగతి తెలిసిందే.
హర్యానా పీసీసీ అధ్యక్షురాలు కుమారి సెల్జా, కర్ణాటక పీసీసీ అధ్యక్షుడు డీకే శివకుమార్.. ఆగస్టు ప్రారంభంలో రాజస్థాన్ సీఎం అశోక్ గెహ్లాట్తో సమావేశమై క్యాబినెట్ విస్తరణపై చర్చించినట్లు సమాచారం. క్యాబినెట్ విస్తరణలో ఇబ్బందులను, సాధక బాధకాలపై చర్చించిన మీదట సచిన్ పైలట్ వర్గానికి అధిక ప్రాధాన్యం ఇవ్వడానికి గెహ్లాట్ సుముఖత వ్యక్తం చేశారని తెలియవచ్చింది.
మరోవైపు ప్రస్తుతం గెహ్లాట్ క్యాబినెట్లో కొందరు సభ్యులు వైదొలగనున్నారని స్పష్టమైన సంకేతాలిచ్చారు కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి అజయ్ మాకెన్. కొందరు మంత్రులు పార్టీ కోసం పని చేసేందుకు క్యాబినెట్ నుంచి బయటకు వచ్చేందుకు అంగీకరించారన్నారు మాకెన్.
అశోక్ గెహ్లాట్తోపాటు 21 మంది రాజస్థాన్ క్యాబినెట్లో ఉన్నారు. మరో తొమ్మిది మందికి చోటు కల్పించవచ్చు. అలాగే జిల్లాల స్థాయిలో పార్టీ పదవులు ఖాళీగా ఉన్నాయి. గతేడాది సచిన్ పైలట్ తిరుగుబాటుతో గెహ్లాట్ సర్కార్ పతనం అంచుకు చేరిన సంగతి తెలిసిందే. అయితే, పైలట్, గెహ్లాట్ మధ్య రాజీ కుదర్చడంలో కాంగ్రెస్ అధిష్ఠానం విజయం సాధించినట్లు తెలుస్తున్నది.