న్యూఢిల్లీ : దేశవ్యాప్తంగా చుక్కలు చూస్తున్న పెట్రోల్ ధరలపై నరేంద్ర మోదీ సర్కార్పై కాంగ్రెస్ నేత సచిన్ పైలట్ విరుచుకుపడ్డారు. సామాన్యుడి జేబులపై ఇది నేరుగా సర్కార్ దాడేనని ఇంధన ధరల పెంపుపై పైలట్ విమర్శలు గుప్పించారు. దేశంలని 250 నగరాల్లో పెట్రోల్ లీటర్ రూ వంద దాటడం ఊహకు అందని విషయమని ఆయన విస్మయం వ్యక్తం చేశారు. ఈ ఏడాదిలోనే మోదీ ప్రభుత్వం పెట్రోల్ ధరలను 66 సార్లు పెంచిందని అన్నారు.
గత ఏడేండ్లలో పెట్రోల్పై ఎక్సైజ్ సుంకం 250 శాతం, డీజిల్పై ఎక్సైజ్ సుంకం 800 శాతం పెంచినట్టు ప్రభుత్వ గణాంకాలే వెల్లడిస్తున్నాయని పేర్కొన్నారు. దీంతో ప్రభుత్వానికి రూ 25 లక్షల కోట్ల రాబడి సమకూరిందని ఇది సామాన్యుడి జేబులను గుల్ల చేయడం కాక మరేమిటని సచిన్ పైలట్ ప్రశ్నించారు. ఇక కరోనా సెకండ్ వేవ్ను ఎదుర్కోవడంలో కేంద్ర ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని ఆరోపించారు. ఆక్సిజన్ సిలిండర్లు, ఆస్పత్రుల్లో పడకలు, మందులు లభించక లక్షలాది మంది ప్రాణాలు కోల్పోయారని ఆందోళన వ్యక్తం చేశారు.