తిరువనంతపురం: కేరళలోని ప్రసిద్ధ అయ్యప్ప స్వామి కొలువైన శబరిమల ఆలయాన్ని రోజువారీ దర్శించే భక్తుల సంఖ్యను 5 వేల నుంచి పది వేలకు పెంచారు. కేరళ ప్రభుత్వం ఈ మేరకు శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. అయితే భక్తులు కరోనా నిబంధనలు పాటించేలా చూడాలని సంబంధిత అధికారులకు సూచించింది. శబరిమల ఆలయాన్ని మాస పూజల కోసం శుక్రవారం తెరిచారు. ప్రధాన పూజారి వీకే జయరాజ్ పొట్టి శుక్రవారం సాయంత్రం 5 గంటలకు తాంత్రి కందారు మహేష్ మోహనారు సమక్షంలో సంప్రదాయ పద్ధతిలో ఆలయాన్ని తెరిచారు.
కార్కిదకం మలయాళ మాసం నేపథ్యంలో అయ్యప్ప స్వామికి ఐదు రోజుల పాటు ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో శనివారం ఉదయం నుంచి ఈ నెల 21 వరకు ఐదు రోజుల పాటు భక్తులకు దర్శనం కల్పించనున్నట్లు ట్రావెన్కోర్ దేవస్వం బోర్డు తెలిపింది. కరోనా నేపథ్యంలో కేరళ హైకోర్టు ఆదేశాల మేరకు రోజుకు 5000 వేల మంది భక్తులకు మాత్రమే స్వామివారి దర్శనం కల్పిస్తామని చెప్పింది. ఆన్లైన్ ద్వారా స్లాట్లు నమోదు చేసుకోవాలని పేర్కొంది. కొత్త మార్గదర్శకాల ప్రకారం 48 గంటలు ముందుగా చేయించుకున్న ఆర్టీ-పీసీఆర్ నెగిటివ్ రిపోర్ట్ లేదా కరోనా వ్యాక్సినేషన్ సర్టిఫికెట్ సమర్పించిన భక్తులను మాత్రమే ఆలయంలోకి ప్రవేశానికి అనుమతిస్తామని బోర్డు వెల్లడించింది.
అయితే శబరిమలను సందర్శించే రోజువారీ భక్తుల సంఖ్యను 5000 నుంచి పది వేలకు కేరళ ప్రభుత్వం పెంచింది. ఈ మేరకు శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. కరోనా మార్గదర్శకాలను పక్కగా పాటించాలని పేర్కొంది. మరోవైపు కరోనా పరీక్షలకు నీలక్కల్లో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఆర్టీ-పీసీఆర్ నెగిటివ్ రిపోర్ట్ గడువు చెల్లిన వారికి కరోనా పరీక్ష చేస్తారు. పాజిటివ్ వచ్చిన వారిని పెరునాడులోని ఐసొలేషన్ కేంద్రానికి తరలిస్తారు.