న్యూఢిల్లీ : భారత్ లో రష్యా సింగిల్ డోస్ కొవిడ్ వ్యాక్సిన్ స్పుత్నిక్ వీ లైట్ ను త్వరలో ప్రవేశపెట్టేందుకు సన్నాహాలు జరుగుతున్నాయని భారత్ లో రష్యా రాయబారి ఎన్ కుడషెవ్ పేర్కొన్నారు. రష్యన్ కొవిడ్-19 వ్యాక్సిన్ స్పుత్నిక్ వీ ఉత్పత్తి భారత్ లో ఏటా 85 కోట్ల డోసులకు పెరుగుతుందని ఆశిస్తున్నామని అన్నారు.
స్పుత్నిక్ వీ రష్యన్-ఇండియన్ వ్యాక్సిన్ అని, భారత్ లో ఈ వ్యాక్సిన్ ఉత్పత్తిని దశలవారీగా పెంచుతారని అంచనా వేస్తున్నామని అన్నారు. స్పుత్నిక్ వీ వ్యాక్సిన్ ను రష్యాలో గత ఏడాది ద్వితీయార్ధం నుంచి పౌరులకు అందిస్తున్నారు. కొవిడ్-19 నూతన స్ట్రెయిన్ ల పైనా ఇది సమర్ధంగా పనిచేస్తుందని రష్యన్ శాస్త్రవేత్తలు వెల్లడించారని కుడషెవ్ తెలిపారు. ఇక స్పుత్నిక్ వీ ఎమర్జెన్సీ వాడకానికి డీజీసీఐ గత నెలలో ఆమోదం తెలిపింది. స్పుత్నిక్ వీ వ్యాక్సిన్ ను డాక్టర్ రెడ్డీస్ లేబొరేటరీస్ భారత్ లో దిగుమతి చేస్తోంది.