న్యూఢిల్లీ: దేశంలో కరోనా మహమ్మారి మహోగ్రరూపం దాల్చింది. దీంతో రోజువారీ కేసులు మరోసారి నాలుగు లక్షలు దాటాయి. మహమ్మారి కొత్తరూపం దాల్చడంతో మరణాలు సరికొత్త రికార్డు స్థాయికి చేరాయి. వైరస్ విజృంభణతో నిన్న 4 లక్షల 10 వేలకుపైగా పాజిటివ్ కేసులు నమోదవగా, నాలుగు వేలకు చేరువలో మరణాలు రికార్డయ్యాయి. దేశంలో మూడు లక్షలకుపైగా కేసులు నమోదవడం వరుసగా ఇది 15వ రోజు కావడం గమనార్హం.
దేశవ్యాప్తంగా గత 24 గంటల్లో కొత్తగా 4,12,262 మంది కరోనాబారినపడ్డారు. ఇండియాలో కరోనా కేసులు ప్రారంభమైనప్పటి నుంచి ఇంత భారీ సంఖ్యలో నమోదవడం ఇదే మొదటిసారి. మే 1న మొదటిసారిగా 4 లక్షలకుపైగా కేసులు నమోదైన విషయం తెలిసిందే. తాజాగా దానికంటే మరో 10 వేలు కేసులు అధికంగా నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 2,10,77,410 దాటాయి. ఇందులో 1,72,80,844 మంది బాధితులు కరోనా నుంచి కోలుకోగా, యాక్టివ్ కేసుల సంఖ్య 35 లక్షల మార్కును దాటింది. ప్రస్తుతం 35,66,398 మంది బాధితులు కరోనా చికిత్స పొందుతున్నారు.
కాగా, నిన్న ఉదయం నుంచి ఇప్పటివరకు 3980 మంది వైరస్ వల్ల మరణించడంతో మొత్తం మృతులు 23,01,68కు చేరాయని కేంద్ర ఆరోగ్య శాఖ ప్రకటించింది. దేశంలో కరోనా పాజిటివిటీ రేటు 24.8 శాతానికి చేరిందని వెల్లడించింది. ఇప్పటివరకు 16,25,13,339 మందికి వ్యాక్సిన్ పంపిణీ చేశామని తెలిపింది.
కాగా, కొత్తగా నమోదైన పాజిటివ్ కేసుల్లో అత్యధికంగా మహారాష్ట్రలో 51,880 కేసులు ఉండగా, కర్ణాటకలో 50,112 ఉన్నాయి. దీంతో మహారాష్ట్ర తర్వాత దేశంలో 50 వేలకుపైగా కేసులు నమోదైన రాష్ట్రంగా కర్ణాటక నిలిచింది. అయితే మరఠ్వాడాలో కరోనా కేసులు కొద్దిగా తగ్గడం విశేషం. అక్కడ మంగళవారం 57,640 నమోదవగా, నిన్న 51880కి తగ్గాయి. ఇక కేరళలో 41,953, తమిళనాడులో 23,310, పశ్చిమబెంగాల్లో 18,102, పంజాబ్లో 8,105 నమోదయ్యాయి.
మరణాల విషయానికి వస్తే.. కొత్తగా నమోదైన 3980 మరణాల్లో అత్యధికంగా మహారాష్ట్రలో 920 ఉండగా, ఉత్తరప్రదేశ్లో 357, కర్ణాటకలో 346, పంజాబ్లో 182, హర్యానాలో 181, తమిళనాడులో 167 చొప్పున ఉన్నాయి.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి