న్యూఢిల్లీ : కరోనా మహమ్మారి దేశాన్ని వణికిస్తున్న నేపథ్యంలో రైడింగ్ యాప్ ఓలా ఔదార్యం చాటుకుంది. తమ యూజర్ల ముంగిటకు ఆక్సిజన్ కాన్సంట్రేటర్లను ఉచితంగా తరలించేందుకు ముందుకొచ్చింది. ఆక్సిజన్ కాన్సంట్రేటర్లు అవసరమైన యూజర్లు కనీస వివరాలు అందించగానే వారి ఇంటి ముందుకే వాటిని ఉచితంగా తీసుకువచ్చేందుకు ఓలా ఏర్పాట్లు చేసింది. గివ్ ఇండియాతో భాగస్వామ్యం ద్వారా ఓలా ఫౌండేషన్ తమ యూజర్లకు ఓలా మొబైల్ యాప్ ద్వారా ఆక్సిజన్ కాన్సంట్రేటర్లను ఉచితంగా సమకూర్చనుంది.
ఆక్సిజన్ కాన్సంట్రేటర్లకు లేదా రవాణా చార్జీల కింద ఓలా తమ యూజర్ల నుంచి ఎలాంటి మొత్తం వసూలు చేయదు. వచ్చే వారంలో బెంగళూర్ లో ప్రారంభమయ్యే ఈ సేవలు మరుసటి వారాల్లో దేశవ్యాప్తంగా అమలు చేస్తామని ఓలా సహ వ్యవస్ధాపకులు భవీష్ అగర్వాల్ వెల్లడించారు. అసాధారణ పరిస్థితుల్లో ప్రజలకు సాయం చేసేందుకు తాము ఓ2ఫర్ఇండియా కార్యక్రమాన్ని చేపట్టామని ఆయన ప్రకటించారు. అవసరమైన వారికి ఉచితంగా ఆక్సిజన్ కాన్సంట్రేటర్లను సరఫరా చేసేందుకు తాము గివ్ఇండియాతో జట్టుకట్టామని చెప్పారు.