నెలలోనే ఐదున్నర రెట్లు పెరుగుదల
అప్రమత్తమైన అధికార యంత్రాంగం
బాధితుల్లో 77% 21-60 ఏండ్ల వారే
ప్రజల్లో ఇప్పటికీ కనిపిస్తున్న నిర్లక్ష్యం
హైదరాబాద్, ఏప్రిల్ 1 (నమస్తే తెలంగాణ): సరిగ్గా ఏడాది కిందట.. కరోనా వైరస్కు భయపడి ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని బిక్కుబిక్కుమంటూ గడిపాం. అత్యవసరమైతే తప్ప గడపదాటని పరిస్థితి. ప్రభుత్వం తీసుకున్న చర్యలకు తోడు.. ప్రతి ఒక్కరూ వ్యక్తిగతంగా మాస్కులు, శానిటైజర్లు, భౌతికదూరాలను బ్రహ్మాస్ర్తాలుగా ఉపయోగించడంతో వైరస్ వ్యాప్తి ని అడ్డుకున్నాం. అప్పట్లో ప్రతిఒక్కరి జేబులో శానిటైజర్ ఉండేది.
ప్రభుత్వ చర్యలు.. ప్రజల సహకారం ఫలితంగా వ్యాప్తి తగ్గి వైరస్ అదుపులోకి వచ్చింది. భయం స్థానంలో నిర్లక్ష్యం ఆవరించింది. ఇప్పుడు మాస్కుల మాటేలేదు.. శానిటైజర్ ఊసే లేదు.. భౌతికదూరం పట్టింపే లేదు. కొవిడ్ నిబంధలన్నీ తుంగలో తొక్కారు. ఫలితంగా కరోనా మరోసారి విజృంభిస్తున్నది. నెల రోజులుగా కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. మన నిర్లక్ష్యం కొంప ముంచుతున్నా ఇప్పటికీ జాగ్రత్తలు తీసుకోనివారు ఎందరో ఉన్నారు.
సిద్ధంగా అధికార యంత్రాంగం
ఈ ఏడాది ఫిబ్రవరి వరకు వైరస్ వ్యాప్తి అదుపులో ఉన్నది. కానీ.. నెల రోజులుగా క్రమంగా కేసులు పెరుగుతున్నాయి. మార్చి 1న 163 కేసులు నమోదుకాగా.. 31న 887 మందికి పాజిటివ్గా తేలింది. అంటే నెల రోజుల్లోనే పాజిటివ్ల సంఖ్య సుమారు ఐదున్నర రెట్లు పెరిగింది. నెల రోజుల్లోనే 9,690 కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. టెస్టుల సంఖ్యను పెంచింది. బుధవారం రాష్ట్రంలో సుమారు 60 వేల నమూనాలను పరీక్షించింది. కరోనా చికిత్స వసతులను పెంచుతున్నది. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా 61 ప్రభుత్వ, 226 ప్రైవేట్ దవాఖానల్లో కొవిడ్ చికిత్స అందిస్తున్నారు.
77% బాధితులు బయట తిరిగేవాళ్లే..
ప్రభుత్వం గురువారం విడుదలచేసిన బులెటిన్ ప్రకారం కొత్తగా నమోదైన కేసుల్లో 77% మంది 21-60 ఏండ్ల మధ్య వయస్కులే. అంటే 887 మందిలో సుమారు 650 మంది వీరే. ఈ వయసువారే ఉద్యోగ, ఉపాధి రీత్యా బయట తిరుగుతుంటారు. ఫంక్షన్లు, ఇతర కార్యక్రమాలకు హాజరవుతున్నారు. ఇందులో మాస్కులు ధరించనివారి సంఖ్యే ఎక్కువ. కొందరైతే ముక్కును, నోటిని కప్పివేయకుండా కేవలం చెవులకు మాస్కులు తగిలించుకొంటున్నారు. బయట తిరుగుతున్నవారి నిర్లక్ష్యం వల్లే వైరస్ వ్యాప్తి పెరుగుతున్నదని నిపుణులు చెప్తున్నారు. వారి వల్ల ఇండ్లకే పరిమితమైన పిల్లలు, వృద్ధులకు సైతం కరోనా సోకుతున్నదని ఆందోళన వ్యక్తంచేస్తున్నారు.
కరోనా కేసులు ప్రారంభమైన నాటినుంచి జీహెచ్ఎంసీ, శివారు జిల్లాల్లో అత్యధిక కేసులు నమోదవుతున్నాయి. తాజాగా గ్రామీణ జిల్లాల్లో కేసులు పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తున్నది. నిర్మల్లో మార్చి 25న 8 మందికి నిర్ధారణ కాగా, 31వ తేదీ నాటికి 78కి చేరింది. వారం వ్యవధిలోనే కేసులు 10 రెట్లు పెరిగాయి. మిగతా జిల్లాల్లోనూ దాదాపు ఇదే పరిస్థితి కనిపిస్తున్నది. కాబట్టి ప్రజలు కొవిడ్ నిబంధనలను పాటించాలని అధికారులు విజ్ఞప్తిచేస్తున్నారు. 45 ఏండ్లు పైబడిన ప్రతి ఒక్కరూ టీకా వేసుకోవాలని కోరుతున్నారు. అత్యవసరమైతే తప్ప ఇంటి నుంచి బయటికి రావొద్దని సూచిస్తున్నారు.
ఒక్కరోజే 887 మందికి పాజిటివ్
రాష్ట్రంలో మంగళవారం 684 కరోనా కేసులు నమోదు కాగా.. బుధవారం ఈ సంఖ్య 887కు పెరిగింది. ఒక్కరోజే 203 కేసులు అదనంగా పెరినట్టు గురువారం విడుదలచేసిన బులెటిన్లో వైద్యారోగ్యశాఖ పేర్కొన్నది. 59,297 నమూనాలను పరీక్షించగా అత్యధికంగా జీహెచ్ఎంసీలో 201, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో 79, నిర్మల్లో 78, రంగారెడ్డిలో 76, జగిత్యాలలో 56, నిజామాబాద్లో 45, సంగారెడ్డిలో 36, కామారెడ్డిలో 27, కరీంనగర్, వరంగల్ అర్బన్లో 23 చొప్పున, మహబూబ్నగర్లో 22, సిద్దిపేట, నల్లగొండలో 21 చొప్పున కేసులు వెలుగుచూశాయి. ఏపీలో కరోనా కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతున్నది. బుధవారం 31,809 పరీక్షలు నిర్వహించగా, 1,271 మందికి పాజిటివ్గా తేలింది.
10 లక్షలు దాటిన తొలిడోస్
రాష్ట్రంలో కరోనా టీకా తొలిడోస్ తీసుకున్నవారి సంఖ్య 10 లక్షలు దాటింది. బుధవారం రాష్ట్రవ్యాప్తంగా 33,689 మందికి టీకా వేశారు. ఇందులో 31,368 మంది తొలిడోస్, 2,321 మంది రెండో డోస్ తీసుకున్నారు. దీంతో తొలిడోస్ తీసుకున్నవారి సంఖ్య 10,24,990కి పెరిగిందని గురువారం విడుదలచేసిన బులెటిన్లో వైద్యారోగ్యశాఖ తెలిపింది. ఇప్పటివరకు 2,39,036 మంది రెండు డోసులు తీసుకున్నట్టు వెల్లడించింది.