న్యూఢిల్లీ: కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ మరోసారి బీజేపీ, దాని మాతృసంస్థ రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్)పై మండిపడ్దారు. ఆ సంస్థ మహిళలను అణచివేస్తే, తమ పార్టీ వారిని అందలం ఎక్కించిందని అన్నారు. బుధవారం ఢిల్లీలో జరిగిన అఖిల భారత మహిళా కాంగ్రెస్ కార్యక్రమంలో రాహుల్ మాట్లాడారు. ‘మీరు మహాత్మా గాంధీ చిత్రాన్ని చూసినప్పుడు, ఆయన చుట్టూ ఇద్దరు లేక ముగ్గురు స్త్రీలను చూస్తారు. మీరు ఏ మహిళతోనైనా మోహన్ భగవత్ చిత్రాన్ని చూశారా? వారి సంస్థ మహిళలను అణచివేస్తుంది. మా సంస్థ వారికి ఒక వేదికను ఇస్తుంది. మోడీ-ఆర్ఎస్ఎస్ దేశంలోని ఏ మహిళను ప్రధానిగా చేయలేదు. కాంగ్రెస్ మాత్రమే చేసింది’ అని అన్నారు.
ఆర్ఎస్ఎస్ హిందుత్వంపై కూడా రాహుల్ మండిపడ్డారు. బీజేపీ-ఆర్ఎస్ఎస్కు చెందిన వారు తమది హిందూ పార్టీ అని చెబుతారని విమర్శించారు. గత 100-200 ఏండ్లలో హిందూ మతాన్ని అర్థం చేసుకున్న, ఆచరించిన వ్యక్తి మహాత్మా గాంధీ అని అన్నారు. దీనిని తాము గుర్తించినట్లుగా బీజేపీ, ఆర్ఎస్ఎస్ గుర్తిస్తుందా? అని ప్రశ్నించారు. ‘మహాత్మా గాంధీ తన జీవితమంతా హిందూ మతాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తే గాడ్సే ఆయనను ఎందుకు చంపాడు. ఇది ఒక వైరుధ్యం, మీరు దాని గురించి ఆలోచించాలి’ అని వ్యాఖ్యానించారు. కాంగ్రెస్కు చెందిన మహాత్మా గాంధీ హిందూ సిద్ధాతం, గాడ్సే, సావర్కర్ హిందూ సిద్ధాంతాలకు తేడా ఏమిటి అనేది తమకు పెద్ద ప్రశ్నగా మిగిలిందన్నారు.
బీజేపీ, ఆర్ఎస్ఎస్ల కంటే కాంగ్రెస్కు భిన్నమైన భావజాలం ఉన్నదని రాహుల్ అన్నారు. కాంగ్రెస్ కార్యకర్తగా, తాను ఇతర సిద్ధాంతాలతో రాజీపడగలనని, కానీ బీజేపీ, ఆర్ఎస్ఎస్ భావజాలంతో రాజీపడలేనని చెప్పారు. ‘వారు (బీజేపీ) తమను తాము హిందూ పార్టీగా చెప్పుకుంటారు. దేశవ్యాప్తంగా లక్ష్మీ, దుర్గపై దాడి చేస్తారు. వారు ఎక్కడికి వెళ్లినా, అక్కడ ఒక లక్ష్మీని, ఒక దుర్గను చంపేస్తారు. వారు దానికి హిందూ మతాన్ని ఉపయోగిస్తారు. వారు మతాన్ని బ్రోకర్ చేస్తారు. కానీ వారు హిందువులు కాదు’ అని మండిపడ్డారు.