మెల్బోర్న్: అధిక కొవ్వుతో బాధపడుతున్న స్ధూలకాయులకు ఉదయం కంటే సాయంత్రం వ్యాయామం చేయడం మెరుగైన ఫలితాలు ఇస్తుందని తాజా అధ్యయనం వెల్లడించింది. సాయంత్ర వేళల్లో వ్యాయామం చేసిన వారిలో కొలెస్ట్రాల్ లెవెల్స్, బ్లడ్ షుగర్ కంట్రోల్లో ఉన్నట్టు ఆస్ట్రేలియన్ క్యాథలిక్ యూనివర్సిటీ (ఏసీయూ) చేపట్టిన అధ్యయనం స్పష్టం చేసింది. టైప్ 2 మధుమేహం ముప్పు అధికంగా ఉండి అధిక కొవ్వు కలిగిన చురుకుగా లేని పురుషులు సాయంత్రం దాటిన తర్వాత వ్యాయామం చేయగా, ఉదయం పూట వ్యాయామం చేసిన వారితో పోలిస్తే జీవక్రియలు వేగవంతమైనట్టు వెల్లడైంది.
కొవ్వుతో కూడిన ఆహారం తీసుకునే వారిలో వాటి ప్రభావాన్ని నిరోధించడంలో ఉదయపు వ్యాయామం కంటే రోజు చివరిలో చేసే వ్యాయామం ఉపకరిస్తుందని ఏసీయూ పరిశోధకులు వెల్లడించారు. మనం ఏ సమయంలో వ్యాయామం చేస్తే ఫలితాలు మెరుగ్గా ఉంటాయనేది స్పష్టమైంది. ఏసీయూ అధ్యయన వివరాలు జర్నల్ డయాబెటలాజియాలో ప్రచురితమయ్యాయి. అయితే ఎక్సర్సైజ్ ఇదే సమయంలో చేస్తే ఇలాంటి ఫలితాలు అందరికీ రావని అధ్యయనం స్పష్టం చేసింది. కొవ్వు అధికంగా ఉండి స్థూలకాయంతో బాధపడేవారు, జీవగడియారానికి విరుద్ధంగా పనిచేసే వారిలోనే తాము ఈ ఫలితాలు పసిగట్టామని పరిశోధకులు పేర్కొన్నారు. సమయానికి నిద్రించి ఉదయాన్నే లేచేవారికి పొద్దున పూటే వ్యాయామం చేయడం ద్వారా వారు రోజంతా చురుకుగా ఉండగలుగుతారని అన్నారు.