భోపాల్: కరోనా వల్ల తల్లి దండ్రులను కోల్పోయిన చిన్నారులకు ప్రతి నెల ఆర్థిక సాయం అందించాలని మధ్యప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయించింది. కరోనాతో తల్లిదండ్రులు, సంరక్షకులను కోల్పోయిన పిల్లలకు ప్రతి నెల రూ.5 వేలు పెన్షన్ అందిస్తామని రాష్ట్ర ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ప్రకటించారు. అదేవిధంగా వారికి ఉచితంగా విద్యను అందిస్తామని, వారి కుటుంబాలకు ఫ్రీగా రేషన్ను పంపిణీ చేస్తామని వెల్లడించారు.
ఇలాంటి పథకాన్నే జమ్ముకశ్మీర్ ప్రభుత్వం కూడా ప్రకటించింది. కరోనాతో తల్లిదండ్రులను కోల్పోయిన చిన్నారులకు ప్రత్యేక స్కాలర్షిప్ అందిస్తామని కశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా తెలిపారు. దీనివల్ల అనాథలుగా మారిన పిల్లలకు మేలు జరుగుతుందని వెల్లడించారు.
మధ్యప్రదేశ్లో కొత్తగా 8970 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో మొత్తం కేసులు 7,00,202కు చేరాయి. ఇందులో 1,09,928 కేసులు యాక్టివ్గా ఉండగా, 5,83,595 మంది బాధితులు కరోనా నుంచి కోలుకున్నారు. మరో 6679 మంది బాధితులు కరోనా వల్ల మరణించారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి