ముంబై: మహారాష్ట్రలోని ఓ కరోనా దవాఖానలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో 13 మంది కరోనా రోగులు అగ్నికి ఆహుతయ్యారు. రాష్ట్రంలోని పాల్ఘర్ జిల్లా వాసాయిలో ఉన్న విజయ్ వల్లభ్ దవాఖానలో కొవిడ్ రోగులకు చికిత్స అందిస్తున్నారు. శుక్రవారం తెల్లవారుజామున దవాఖానలోని ఐసీయూలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీంతో అందులో చికిత్స పొందుతున్నవారిలో 13 మంది సజీవ దహణమయ్యారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు ప్రారంభించారు. దవాఖానలోని రోగులను సమీపంలోని హాస్పిటళ్లకు తరలించారు. ఫైర్ఇంజిన్ల సహాయంతో మంటలను ఆర్పడానికి ప్రయత్నిస్తున్నారు. మంటలు చెలరేగిన సమయంలో ఐసీయూలో 17 మంది రోగులు ఉన్నట్లు సమాచారం. ఈ అగ్నిప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియరాలేదు.
ఇది చాలా పెద్ద ప్రమాదమని, దీనికి బాధ్యులైనవారిపై చర్యలు తీసుకుంటామని మహారాష్ట్ర మంత్రి ఎక్నాథ్ షిండే అన్నారు. మృతుల కుటుంబాలకు ప్రభుత్వం తరఫున రూ.5 లక్షలు ఆర్థికసాయం అందిస్తామని తెలిపారు. ఆయన ప్రమాద స్థలాన్ని పరిశీలించారు. ఘటనకు సంబంధించిన వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు.
విరార్ హాస్పిటల్ దుర్ఘటన పట్ల ప్రధాని మోదీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుంటుంబాలకు సంతాపం తెలిపారు. గాయపడినవారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. ఈ మేరకు మేదీ ట్వీట్ చేశారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవికూడా చదవండి..