కోల్కతా: పైన ఉన్న ఫొటో చూశారు కదా. దీనిని గీసింది పశ్చిమ బెంగాల్కు చెందిన ఆర్టిస్ట్ సనాతన్ దిండా. మా ఆశ్చె (అమ్మ వస్తోంది) అనే క్యాప్షన్తో ఈ డ్రాయింగ్ను అతడు సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. దుర్గా పూజకు సమయం దగ్గరపడుతున్న వేళ అతడు ఇలాంటి చిత్రం గీసి, దానికి ఈ క్యాప్షన్ పెట్టడంతో చాలా మంది తీవ్రంగా మండిపడ్డారు. దుర్గా మాతకు బుర్ఖా వేయడమేంటని ప్రశ్నించారు. పశ్చిమ బెంగాల్ బీజేపీ మహిళా మోర్చా ఉపాధ్యక్షురాలు కేయా ఘోష్ దీనిపై స్పందిస్తూ.. దుర్గా మాత హిజాబ్లో చూపించాడు. సనాతన్ దిండా దీనిని గీశాడు. ఇలాంటివి చేసి కూడా అతడు తప్పించుకోగలడు. ఎందుకంటే బెంగాల్లో ఎంతో మంది మేధావులు దీనిపై ప్రశంసలు కురిపిస్తున్నారు కదా అని ఆమె ట్వీట్ చేశారు. మిగతా నెటిజన్లు కూడా సనాతన్పై మండిపడుతూ కామెంట్లు చేశారు.
బుర్ఖా అయితే తప్పేంటి?
అయితే దీనిపై ఆ ఆర్టిస్ట్ స్పందిస్తూ.. ఆ చిత్రంలో ఉన్న దుర్గా మాత అనే ఎందుకు అనుకోవాలి. నా వరకైతే ఆమె ఒక మహిళ అని సనాతన్ అన్నాడు. నేను ఎక్కడా బుర్ఖా లేదా హిజాబ్ అని రాయలేదు. ఈ పురుషాధిక్య సమాజం నుంచి తన సౌందర్యాన్ని కాపాడుకుంటున్న మహిళగా చిత్రించాను. కావాలనే కొందరు దీనిపై దుష్ప్రచారం చేస్తున్నారు అని సనాతన్ అన్నాడు. నేటి సమాజంలో మహిళలు ఎదుర్కొంటున్న అణచివేతను ఉద్దేశించి గీసిన చిత్రం ఇది. ఆఫ్ఘనిస్థాన్లోనే చూడండి. అక్కడ మహిళల పరిస్థితి ఎలా ఉందో చూస్తున్నాం. అందువల్ల ఈ ఫొటో మత, ప్రాంత సరిహద్దులకు అతీతమైనది అని సనాతన్ దిండా చెప్పాడు.
అంతేకాదు బుర్ఖా ఉంటే తప్పేంటి అని కూడా అతడు ప్రశ్నించాడు. బుర్ఖాను నేను ఓ సానుకూలాంశంగా చూస్తాను. నిజానికి అది సాధికారత. జలగల్లాంటి పురుషుల చూపుల నుంచి స్త్రీలను అది రక్షిస్తుంది అని దిండా అన్నాడు. ఇందులో ఎలాంటి తప్పూ లేకపోయినా.. తనపై ఒత్తిడి తీసుకొచ్చి ఈ చిత్రాన్ని తొలగించేలా చేశారని, బలవంతంగా క్షమాపణ చెప్పించారని దిండా చెప్పాడు. తన కూతురిని రేప్ చేస్తామని కూడా కొందరు బెదిరించినట్లు అతడు వెల్లడించాడు. చరిత్ర తెలియని నిరక్ష్యరాస్యులు, మతం, ఆధునిక కళ గురించి తెలియని వాళ్లే ఈ అంశాన్ని చిలువలు పలువలు చేశారని మండిపడ్డాడు.