రామగిరి, ఏప్రిల్ 19 : ప్రైవేట్ ఉపాధ్యాయులకు ప్రభుత్వం ప్రకటించిన సాయం మంగళవారం నుంచి వారికి అందనున్నది. ప్రతి నెలా రూ.2 వేలు, ఉచితంగా 25 కిలోల సన్నబియ్యం అందిస్తామని సీఎం కేసీఆర్ ప్రకటించిన విషయం విదితమే. అర్హులైన వారి నుంచి దరఖాస్తులను ఆహ్వానించగా నల్లగొండ జిల్లావ్యాప్తంగా 6,778 మంది, సూర్యాపేట జిల్లా నుంచి 2628 మంది దరఖాస్తులు చేశారు. వీరిలో అర్హులైన వారందరికీ ఈనెల 20నుంచి బ్యాంకు ఖాతాల్లో రూ.2 వేలు, ఒక్కొక్కరికి 25కిలోల బియ్యం రేషన్ దుకాణాల్లో ఇవ్వనున్నారు.
నల్లగొండలో జిల్లాలో 6,778దరఖాస్తులు
నల్లగొండ 385 ప్రభుత్వ గుర్తింపు పొందిన పాఠశాలలు ఉన్నాయి. వీటిలో పనిచేసే ఉపాధ్యాయులు, ఇతర సిబ్బంది నుంచి 6,778 దరఖాస్తులు జిల్లా విద్యాశాఖ చేరాయి. అయితే యూనైటెడ్ డిస్ట్రిక్ ఇన్ఫార్మేషన్ సిస్టమ్ ఫర్ ఎడ్యుకేషన్(యూడైఎస్) ప్రకారం దరఖాస్తు చేసిన వారిలో 4,952 మంది ఉన్నారు. మిగిలిన 1,826మందికి సంబంధించి ఫిజికల్గా ప్రత్యేక టీంలను ఏర్పాటు చేసి జిల్లా విద్యాశాఖ ఆధ్వర్యంలో పరిశీలన చేసినట్లు డీఈఓ బి.భిక్షపతి వెల్లడించారు.
వివరాలు అందించిన పాఠశాలలు..
జిల్లాలోని ఆయా ప్రైవేట్ పాఠశాలల్లో పనిచేస్తున్న బోధన, బోధనేతర సిబ్బందితో ఆన్లైన్లో చేసి దరఖాస్తుల హార్డ్ కాపీలను పాఠశాలల హెచ్ఎంలు డీఈఓ కార్యాలయానికి సమర్పించారు. వీరికి సంబంధించిన పూర్తి వివరాలను పరిశీలన పూర్తి చేశారు. ఆ జాబితాను కలెక్టర్ ద్వారా ప్రభుత్వానికి నివేదించనున్నట్లు తెలిసింది. ఈనెల 20నుంచి అర్హులందరికీ సాయం అందనుంది.