వెల్దుర్తి, ఏప్రిల్ 18: కొండపోచమ్మ సాగర్ నుంచి సంగారెడ్డి కెనాల్ ద్వారా గోదావరి జలాలు పదమూడో రోజూ ఆదివారం పరుగులు తీశాయి. హల్దీవాగులోకి బిరబిరా వస్తున్న గోదావరి జలాలతో చెక్డ్యామ్లు నిండుతున్నాయి. 13వ రోజైన ఆదివారం వెల్దుర్తి మండలంలో ఉప్పులింగాపూర్ చెక్డ్యామ్ నిండింది. ఆదివారం కిలోమీట మేర గోదావరి జలాలు ప్రవహించాయి. అపర భగీరథుడు, సీఎం కేసీఆర్ ఈనెల 6న సిద్దిపేట జిల్లా అవుసులపల్లి వద్ద సంగారెడ్డి అప్టెక్ తూం వద్ద గోదావరి జలాలను వదిలిన సంగతి తెలిసిందే. మరో నాలుగైదు రోజుల్లో కామారెడ్డి జిల్లా నిజాంసాగర్ ప్రాజెక్టుకు గోదావరి జలాలు చేరుకుంటాయి. హల్దీవాగుపై 32 చెక్డ్యామ్లకు గాను ఆదివారం వరకు 25 నిండాయి. మొత్తం నాలుగు చెరువులు నిండాయి. ఆదివారం జడ్పీ చైర్పర్సన్ హేమలతశేఖర్గౌడ్, రాష్ట్ర లేబర్ కమిషన్ చైర్మన్ దేవేందర్రెడ్డితో కలిసి మెదక్ జిల్లా వెల్దుర్తి మండలం నెల్లూర్ పోచమ్మ అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.
అనంతరం వెల్దుర్తి చెక్డ్యాం, ఉప్పులింగాపూర్ బ్రిడ్జి వద్ద గోదావరి జలాలకు ప్రత్యేక పూజలు నిర్వహించి, పసుపు, కుంకుమ, చీర, సారె సమర్పించారు. ఈ సందర్భంగా ఉప్పులింగాపూర్ వద్ద నిర్వహించిన సమావేశంలో మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్రెడ్డి మాట్లాడుతూ.. సాగు,తాగునీటి వెతలు తీరుస్తూ సీఎం కేసీఆర్ రైతులకు అన్ని విధాలుగా అండగా నిలుస్తున్నారని, మండుటెండల్లో చెరువులు, చెక్డ్యామ్లు, వాగులు జలకళ సంతరించుకోవడం సీఎం కేసీఆర్ భగీరథ ప్రయత్నంతోనే సాధ్యమైందని అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు, రంగనాయకసాగర్, మల్లన్నసాగర్, కొండపోచమ్మ సాగర్ను నిర్మించి గోదావరి నీళ్లను మళ్లించి బీడు భూములను సస్యశ్యామలం చేస్తున్నారన్నారు. ఎమ్మెల్యే మదన్రెడ్డి మంజీరా, హల్దీవాగులపై చెక్డ్యామ్లను నిర్మించి వచ్చే నీటిని ఒడిసి పట్టుకొని సాగు, తాగునీటి కష్టాలను తీర్చారన్నారు.