బిచ్కుంద, జూలై 1: జుక్కల్, బిచ్కుంద మండల కేంద్రాల్లో సెంట్రల్ లైటింగ్ ఏర్పాటుకు కృషి చేస్తానని రాష్ట్ర రోడ్లు, భవనాలు, శాసనసభా వ్యవహారాల శాఖ మంత్రి
వేముల ప్రశాంత్రెడ్డి అన్నారు. గురువారం ఆయన బిచ్కుంద మండలం పెద్దదేవాడ వాగుపై నిర్మించిన హైలెవల్ బ్రిడ్జిని ఎంపీ బీబీ పాటిల్, ఎమ్మెల్యే హన్మంత్ షిండేతో కలిసి ప్రారంభించారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం అమలుచేస్తున్న సంక్షేమ పథకాలతో పేదలు ఎంతో అభివృద్ధి చెందుతున్నారని పేర్కొన్నారు. రాష్ట్రంలో అమలవుతున్న సంక్షేమ పథకాలు దేశంలో ఏ రాష్ట్రంలోనూ లేవన్నారు. తెలంగాణ ప్రగతిని చూసి సరిహద్దు ప్రాంతాలవాసులు తెలంగాణలో చేరుతామని కోరుతున్నారని గుర్తుచేశారు. రైతుబంధు, రైతుబీమా, కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్, ఉచిత విద్యుత్ తదితర పథకాలు చూసి మహారాష్ట్ర ప్రజలు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారని తెలిపారు. పల్లెప్రగతి ,పట్టణ ప్రగతితో గ్రామాలు వేగంగా అభివృద్ధి చెందుతున్నాయని అన్నారు.
పారిశుద్ధ్య నిర్వహణలో భాగంగా ప్రతి గ్రామ పంచాయతీకి ట్రాక్టర్లను అందజేసినట్లు తెలిపారు. హరితహారం కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి సంరక్షించాలని సూచించారు. గతంలో నాటిన మొక్కలు ఏపుగా పెరిగి పచ్చటి తోరణాలుగా మారాయన్నారు. రాష్ట్ర ప్రభుత్వం నిధులు విడుదల చేసిన వెంటనే జుక్కల్ నియోజకవర్గానికి మరిన్ని నిధులిస్తామని హామీ ఇచ్చారు. పెద్ద దేవాడ హైలెవల్ బ్రిడ్జి నిర్మాణానికి జుక్కల్ ఎమ్మెల్యే హన్మంత్షిండే నిధులు విడుదల చేయాలని తనను చాలా సార్లు కోరారని, ఆయన కృషితోనే పెద్దదేవాడ బ్రిడ్జి నిర్మాణం పూర్తయ్యిందని తెలిపారు. నియోజకవర్గానికి ఎల్లపుడూ తన సహాయసహకారాలు ఉంటాయన్నారు. కార్యక్రమంలో జడ్పీ చైర్పర్సన్ దఫేదార్ శోభ, జడ్పీ మాజీ చైర్మన్ దఫేదార్ రాజు, ఎంపీపీ అశోక్ పటేల్, జడ్పీటీసీ భారతిరాజు, విండో చైర్మన్ బాలజీ ,పెద్దదేవాడ సర్పంచ్ శివానందప్ప, పుల్కల్ రాజుపటేల్, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు వెంకట్రావు, నాయకులు పాల్గొన్నారు.