ఆ పల్లె ప్రకృతి రమణీయతకు పెట్టింది పేరు. ఎటు చూసినా ఆకుపచ్చని పొలాలు, నాటి
వైభవానికి సాక్ష్యంగా నిలిచే చారిత్రక కట్టడాలు, వేసవిలోఅతిథులుగా వచ్చే విదేశీ పక్షుల పలకరింపులు. అన్నీ కలిసి ఈ మారుమూల గ్రామాన్నిప్రత్యేకంగా నిలుపుతున్నాయి.
పల్లె చుట్టూ సహజసిద్ధంగా ఏర్పడ్డ మూడు జలాశయాలు..నీటి కరువు లేకుండా
ప్రజలను కాపాడుతున్నాయి.
మహబూబాబాద్ జిల్లా నెల్లికుదురు మండలంలోని రాజుల కొత్తపల్లి గ్రామానికి చారిత్రకంగా ఎంతో పేరుంది. నవాబుల కాలంలో ఈ పల్లె ఓ వెలుగు వెలిగింది. ఈ ఊరి పేరు చెప్పగానే నిజాం రాజ కుటుంబీకులు బస చేసిన చావిడి, బురుజు కోట, పలుగురాళ్లతో నిర్మితమైన ప్రాచీన ఉడయవర్ల సన్నిధి, బోడగుట్టపై వెలిసిన వేణుగోపాలస్వామి, ఏటా వేసవిలో వచ్చే విదేశీ పక్షులు, పచ్చని ప్రకృతి అందాలు కండ్లముందు కదులాడుతాయి.
పేరు వెనుక కథ
భద్రాచలంలో ఏటా నిర్వహించే సీతారామ కల్యాణ మహోత్సవానికి నిజాం నవాబులు ముత్యాల తలంబ్రాలను తీసుకెళ్లేవారు. భాగ్యనగరం నుంచి భద్రాచలానికి ప్రయాణించే క్రమంలో మార్గమధ్యంలో ఈ పల్లెలో విశ్రాంతి తీసుకునేవారు. దీంతో రాచకుటుంబీకులు బస చేసేందుకు ఓ చావిడి నిర్మించారు. అందుకే గ్రామానికి ‘రాజుల కొత్తపల్లి’ అనే పేరొచ్చింది.
మార్పు లేని ‘చావిడి’
నిజాం ప్రభువులు బస చేసిన ‘చావిడి’ నేటికీ చెక్కుచెదరకుండా ఉంది. నాటి కాలంలో చావిడి వద్దే పల్లెల్లోని తగాదాలను పరిష్కరించేవారు. పర్యటనల సందర్భంగా రాజులు ఇక్కడే విశ్రాంతి తీసుకొనేవారు. వెంట తెచ్చుకున్న నిధిని భద్రపర్చుకోవడానికి కోట బురుజునూ నిర్మించారు. ప్రస్తుత గ్రామ పంచాయతీ భవనం వెనుక ఉన్న బురుజు చారిత్రక వైభవానికి సజీవ సాక్ష్యంగా నిలుస్తున్నది.
కానరాని కరువు
గ్రామం చుట్టుపక్కల సహజసిద్ధంగా ఏర్పడిన పెద్ద చెరువు, శనికుంట, మద్దెలకుంట జలాశయాలు.. ఈ పల్లెను ‘చలివేంద్రం’గా మార్చేశాయి. వర్షాభావ పరిస్థితుల్లోనూ నిండుకుండల్లా తొణికిసలాడేవి. కాబట్టే, గ్రామ ప్రజలకు కరువు కాటకాలు తెలియకుండా చేశాయి. ఇప్పటికీ మూడు పంటలకూ సాగునీరు, తాగునీరు అందిస్తున్నాయి. వేసవి – వర్షకాలాల మధ్యలో ఈ జలాశయాలకు వందల సంఖ్యలో విదేశీ పక్షులు వలస వస్తుంటాయి. అందులో తెల్ల కొంగలూ ఉంటాయి. దీంతో, ‘కొంగల కొత్తపల్లి’ అని కూడా వ్యవహరించేవారు.
ఆధ్యాత్మికంగానూ..
గ్రామం నడిబొడ్డున పలుగురాళ్ల వరుసలతో నిర్మితమైన ‘ఉడయవర్ల సన్నిధి’ అనే ప్రాచీన దేవాలయం ఉన్నది. గ్రామ శివారులోని బోడగుట్టపై వేణుగోపాలస్వామి ఆలయాన్ని నిర్మించారు. అప్పట్లో ఈ ఆలయాలు నిత్య ధూపదీప నైవేద్యాలతో కళకళలాడేవి. నాటినుంచి నేటి వరకూ పలు శ్రీవైష్ణవ కుటుంబాలు స్వామివార్లను సేవిస్తున్నాయి. మహాకవి దాశరథి కృష్ణమాచార్యుల మాతృవంశీయులు నేటికీ ఈ గ్రామంలో నివసిస్తున్నారు. అక్షర వాచస్పతి దాశరథి రంగాచార్యులు కొన్నాళ్లు ఇక్కడ చదువుకున్నట్లు ఆ కుటుంబీకులు చెబుతున్నారు. ఆశుకవిత్వంతో రాచరికాన్ని మెప్పించిన కందాడై శఠగోపాలాచార్య, సంస్కృతాంధ్ర భాషా ప్రవీణులు కండ్లకుంట వేంకటాచార్యులు ఈ గ్రామవాసులే. ఒకటా రెండా, ఈ పల్లెకు ఎన్నో ప్రత్యేకతలు!
ఎంతో ్రప్రశస్తి
మా గ్రామానికి ఎంతో ప్రాశస్త్యం ఉన్నది. నిజాం నవాబుల కాలంలో ప్రభువులు మా గ్రామంలో బస చేసేవాళ్లు. సీతారాముల కళ్యాణానికి హైదరాబాద్ నుంచి ముత్యాల తలంబ్రాలను భద్రాచలానికి తీసుకెళ్లే సమయంలో, రాజుల కొత్తపల్లిలోనే విశ్రాంతి తీసుకునేవారు. అందుకోసం ఇక్కడ ఓ చావిడి, ఓ కోట బురుజు నిర్మించారు. కేవలం పలుగురాళ్లతోనే అద్భుతంగా నిర్మితమైన ‘ఉడయవర్ల సన్నిధి’ ఆలయం, బోడగుట్టపై ఉన్న శ్రీ వేణుగోపాలస్వామి ఆలయం తప్పక సందర్శించాల్సినవి.
-తూళ్ల సంధ్యారాణి, సర్పంచ్ రాజుల కొత్తపల్లి
-మస్కపురి సుధాకర్
ఇవీ కూడా చదవండి…
ఎమ్మెల్సీ పదవి అంటేనే రాంచందర్రావుకు చిన్నచూపు
సీఎం కేసీఆర్కు టీయూడబ్ల్యూజే కృతజ్ఞతలు
రెండు రోజులు మినహా మార్చి మొత్తం సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల సేవలు
కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ సాధనకు ఇక సమరమే
బీజేపీకి మంత్రి కేటీఆర్ హెచ్చరిక