భోపాల్ : పెట్రోల్ ధరలు దేశంలో చుక్కలను తాకుతుండగా మధ్యప్రదేశ్ బీజేపీ మంత్రి ప్రజలకు చవకైన పరిష్కారం సూచించారు. భోపాల్లో మంగళవారం లీటర్ పెట్రోల్ రూ 107 దాటగా రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి ప్రద్యుమన్ సింగ్ తోమర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. పెట్రోల్ వాడకం తగ్గిస్తూ కూరగాయల మార్కెట్కు సైకిల్పై వెళ్లలేమా అని ప్రశ్నించారు. ఇలా చేస్తే మనం ఆరోగ్యంగా ఉండటంతో పాటు కాలుష్యానికి దూరంగా ఉండవచ్చని వ్యాఖ్యానించారు.
ఇంధన ధరలు అధికంగా ఉన్నమాట వాస్తవమేనని, వీటి ద్వారా సమకూరిన నిధులను పేదల సంక్షేమానికి వెచ్చిస్తున్నారని అన్నారు. ఆరోగ్య పధకాల కంటే పెట్రోల్, డీజిల్ ధరలు ముఖ్యమా అని వ్యాఖ్యానించారు. పెట్రోల్, డీజిల్ ధరలను కేంద్రం నియంత్రిస్తుందని, రాష్ట్రాలకు సంబంధం లేదని అన్నారు.