రంగారెడ్డి, ఏప్రిల్ 2,(నమస్తే తెలంగాణ): జిల్లాలో స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ల శాఖకు కాసుల పంట పండింది. గతేడాది జిల్లాలో వ్యవసాయేతర భూముల క్రయవిక్రయాలతో రూ.1571 కోట్ల ఆదాయం ఖజానాకు చేరింది. జిల్లా రిజిస్ట్రార్ కార్యాలయంలోనే అధిక ఆదాయం సమకూరింది. ధరణి పోర్టల్ను అందుబాటులోకి తీసుకొచ్చేందుకు సుమారు 4 నెలలపాటు రిజిస్ట్రేషన్లు పూర్తిగా నిలిపేశారు. వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్లు తహసీల్దార్లకు అప్పగించడం, కరోనా వంటి కారణాలతో జిల్లాలో దాదాపు రూ.100 కోట్ల వరకు రెవెన్యూ తగ్గింది. చివరలో రిజిస్ట్రేషన్ల శాఖ ఆదాయం పుంజుకున్నది. జిల్లాలోని చేవెళ్ల, ఇబ్రహీంపట్నం, షాద్నగర్ నియోజక వర్గాల మీదుగా అత్యంత ప్రతిష్టాత్మక రీజినల్ రింగ్రోడ్డు వెళ్తున్నది. దీంతో చేవెళ్ల నియోజకవర్గంలోని చేవెళ్ల, శంకర్పల్లి, షాబాద్, షాద్నగర్ నియోజకవర్గంలోని షాద్నగర్, తదితర ప్రాంతాలు, ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలోని ఇబ్రహీంపట్నం, యాచారం, మాల్ వరకు పెద్దఎత్తున వెంచర్లు ఏర్పాటు చేస్తున్నారు. ఇప్పటికే ఏర్పాటు చేసిన వెంచర్లలోనూ అధిక మొత్తంలో ప్లాట్ల క్రయవిక్రయాలు జరుగుతున్నాయి. దీంతో రెండు, మూడు నెలలుగా వ్యవసాయేతర రిజిస్ట్రేషన్లకు సంబంధించి ఆదాయం భారీగా పెరిగింది.
రూ.1571.47 కోట్ల ఆదాయం
వ్యవసాయేతర భూముల క్రయవిక్రయాల ద్వారా జిల్లా రిజిస్ట్రేషన్ల శాఖకు గత ఆర్థిక సంవత్సరం రూ.1571.47 కోట్ల రెవెన్యూ వచ్చింది. అత్యధికంగా జిల్లా రిజిస్ట్రార్ కార్యాలయంలో రూ.453.78 కోట్ల రాబడి వచ్చింది. జిల్లాలోని గండిపేట్, శేరిలింగంపల్లి, మహేశ్వరం సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో అధిక రెవెన్యూ ప్రభుత్వ ఖజానాకు చేరింది. జిల్లావ్యాప్తంగా 1,69,125 డాక్యుమెంట్ల రిజిస్ట్రేషన్ పూర్తయ్యింది.
చివరి మూడు నెలల్లో భారీగా ఆదాయం
కరోనా ప్రభావం, ధరణి పోర్టల్ను అందుబాటులోకి తీసుకొచ్చే క్రమంలో రిజిస్ట్రేషన్లను నిలిపేయడం వంటి కారణాలు ఉన్నప్పటికీ రాబడిపై ప్రభావం చూపలేదు. గతంలో వ్యవసాయ, వ్యవసాయేతర రిజిస్ట్రేషన్లు సబ్ రిజిస్ట్రార్ల ద్వారానే జరిగేవి. ధరణి పోర్టల్ అందుబాటులోకి వచ్చిన అనంతరం కేవలం వ్యవసాయేతర రిజిస్ట్రేషన్లను సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో నిర్వహిస్తున్నారు. డిసెంబర్ చివరి నుంచి ఆర్థిక సంవత్సరం చివరి వరకు వ్యవసాయేతర రిజిస్ట్రేషన్లు పెరుగడంతో ఆదాయం పుంజుకున్నది.
– స్థితప్రజ్ఞ, జిల్లా రిజిస్ట్రార్, రంగారెడ్డి
ఇవీ కూడా చదవండి
రాష్ట్రంలో మరో 20 ప్రత్యేక స్టోర్లు
మీడియా, వినోద రంగం కోలుకున్నట్టే
ఆర్బీఐ మాజీ డిప్యూటీ గవర్నర్ చక్రవర్తి మృతి
చౌకగా ఇచ్చే వారివద్దే చమురు కొనుగోలు!