హైదరాబాద్, జూలై 26 (నమస్తే తెలంగాణ): గల్ఫ్ దేశాల్లో పనిచేసే భారత వలస కార్మికులకు కేంద్ర ప్రభుత్వం కనీస రిఫరల్ వేతనాలను పునరుద్ధరించింది. అక్కడ 2019-20లో ఉన్న కనీస రిఫరల్ వేతనాలను మళ్లీ అమలు చేస్తున్నట్లు స్పష్టం చేసింది. గల్ఫ్లో ఉపాధిని పరిరక్షించేందుకు కేంద్ర ప్రభుత్వం గతేడాది సెప్టెంబర్ నుంచి తాత్కాలికంగా 10 నెలలపాటు కనీస రిఫరల్ వేతనాలను తగ్గించింది. ఇప్పుడు అక్కడ లేబర్ మార్కెట్ స్థిరీకృతం కావడంతో గతంలో ఉన్న కనీస రిఫరల్ వేతనాలను మరోసారి వర్తింపజేసినట్లు విదేశీ వ్యవహారాల శాఖ సహాయ మంత్రి వీ మురళీధరన్ ఇటీవల రాజ్యసభలో ఓ ప్రశ్నకు సమాధానంగా వెల్లడించారు. గల్ఫ్లోని వలస కార్మికులకు కనీస రిఫరల్ వేతనాలను 30 నుంచి 50 శాతం మేరకు తగ్గిస్తూ గతేడాది సెప్టెంబర్లో జారీచేసిన సర్క్యులర్లను రద్దు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం ఎట్టకేలకు అంగీకరించిందని, ఈ నిర్ణయం పట్ల గల్ఫ్ వలస కార్మికులు సంతోషం వ్యక్తం చేస్తున్నారని వలస కార్మికుల హక్కుల కార్యకర్త భీమ్రెడ్డి మందా తెలిపారు. ఈ నిర్ణయంతో ప్రస్తుతం గల్ఫ్ దేశాల్లో నివసిస్తున్న దాదాపు 88 లక్షల మంది భారత కార్మికులకు లబ్ధి చేకూరుతుందన్నారు. గల్ఫ్లో కనీస వేతనాలను కుదింపు సర్క్యులర్లను రద్దు చేయాలంటూ నిర్వహించిన ఉద్యమానికి తెలంగాణ గల్ఫ్ వర్కర్స్ జాయింట్ యాక్షన్ కమిటీ (గల్ఫ్ జాక్) సారథ్యం వహించింది. ఈ డిమాండ్ను నెరవేర్చాలని రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ గతంలోనే కేంద్రానికి విజ్ఞప్తి చేశారు.
మంత్రి కేటీఆర్, ఎమ్మెల్సీ కవిత కృషి అమోఘం
గల్ఫ్ కార్మికుల వేతనాలపై కేంద్ర ప్రభుత్వం తీసుకున్న తాజా నిర్ణయం పట్ల టీఆర్ఎస్ ఎన్నారై బహ్రెయిన్ విభాగం అధ్యక్షుడు రాధారపు సతీశ్కుమార్ హర్షం వ్యక్తం చేశారు. గల్ఫ్ కార్మికులకు కనీస వేతనాలను పునరుద్ధరించాలంటూ టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీఆర్తోపాటు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి పాత సర్క్యులర్ల రద్దుకు విశేషంగా కృషి చేశారని కొనియాడారు. తమ జీవితాలకు అండగా నిలిచిన మంత్రి కేటీఆర్కు, ఎమ్మెల్సీ కవితకు, టీఆర్ఎస్ ఎంపీలకు సతీశ్కుమార్ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.