థానే : మహారాష్ట్రలోని థానే జిల్లాలో ఓ నాలుగు అంతస్తుల నివాస భవనం కుప్పకూలింది. ఉల్లాస్నగర్ పట్టణంలో శనివారం మధ్నాహ్నం ఈ ఘటన జరిగింది. శిథిలాల కింద చిక్కుకున్న వారిలో 11 మందిని పోలీసులు రక్షించారు. ఇంకా ఐదుగురు వాటికిందే ఉన్నట్లు భావిస్తున్నారు. వీరిని రక్షించేందుకు అధికారులు సహాయక చర్యలను ముమ్మరం చేశారు.
క్యాంపు నెంబర్ 1 ప్రాంతంలోని బహుళ అంతస్తుల భవనం (జీ-ఫ్లస్ 4) మధ్యాహ్నం ఒంటిగంటా 40 నిమిషాల సమయంలో కుప్పకూలడంతో చాలామంది శిథిలాల కింద చిక్కుకున్నారని థానే మున్సిపల్ కార్పొరేషన్ విపత్తు నిర్వహణ విభాగం ముఖ్య అధికారి సంతోశ్ కదం తెలిపారు.
విషయం తెలుసుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలానికి చేరుకొని శిథిలాల కింద చిక్కుకున్న 11 మందిని రక్షించారు. గాయపడిన వారిని ప్రథమ చికిత్స నిమిత్తం సమీపంలోని దవాఖానకు తరలించారు. శిథిలాల కింద ఉన్న మరో ఐదుగురిని రక్షించేందుకు అగ్నిమాపక సిబ్బందికి విపత్తు నిర్వహణ బృందం సహాయం అందిస్తున్నదని అధికారులు తెలిపారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి.