కరువు నేలకు గోదావరి జలాలతో అభిషేకం
మురిసిన రైతన్న.. సీఎం కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం
జనగామ రూరల్, ఏప్రిల్ 17 : ఒకప్పుడు అది కరువు నేల.. విత్తనాలు నాటి రైతులు వరుణుడి కరుణ కోసం ఆకాశంకేసి చూసిన రోజులు కోకొల్లలు.. ఏడాదికి ఒక్క పంట వేసినా నీరు లేక అది చేతికస్తుందో.. రాదోననే శంకతోనే రైతు విలవిల్లాడేవాడు. కానీ, ఇప్పుడు గోదావరి జలాల రాకతో అదే నేలలో మండు వేసవిలోనూ చెరువులు మత్తళ్లు దుంకుతున్నాయి. కుంటలు నిండుకుండల్లా దర్శనమిస్తున్నాయి. కరువు ప్రాంతమైన జనగామలోని బీడు భూములు పచ్చదనాన్ని పరుచుకున్నాయి. బొమ్మకూరు రిజర్వాయర్ నుంచి కాల్వల ద్వారా గోదావరి జలాలను ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి ఆదేశంతో అడవి కేశ్వాపూర్, వెంకిర్యాల, గానుగుపహాడ్, పెద్దపహాడ్, ఓబుల్కేశ్వాపూర్ గ్రామాలకు తరలిస్తున్నారు. దీంతో గానుగుపహాడ్ గ్రామంలోని గొందల చెరువు నిండి మత్తడి దుంకడంతో రైతులు సీఎం కేసీఆర్, ఎమ్మెల్యే ముత్తిరెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు. కార్యక్రమంలో సర్పంచ్ శానబోయిన శ్రీనివాస్, ఎంపీటీసీ రెడ్డబోయిన పద్మ- బాలస్వామి, టీఆర్ఎస్ గ్రామ అధ్యక్షుడు అయిలయ్య, రైతులు రాములు, సిద్దులు, గట్టయ్య, బాలస్వామి, మల్లేశం, కొమురయ్య, సత్తయ్య, బాలరాజు తదితరులు పాల్గొన్నారు.