న్యూఢిల్లీ, జూన్ 4: దేశవ్యాప్తంగా న్యాయస్థానాలను ఆధునిక సదుపాయాలతో తీర్చిదిద్దటం కోసం ప్రత్యేకంగా ‘నేషనల్ జ్యుడీషియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్’ను ఏర్పాటుచేయాలని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) జస్టిస్ ఎన్వీ రమణ కొత్త ప్రతిపాదన చేశారు. ప్రస్తుతం కోర్టులలో మౌలిక సదుపాయాల కొరత తీవ్రసమస్యగా తయారైందని, న్యాయసేవలను వెలువరించటంలో ఇది ప్రధాన ఆటంకంగా ఉంటున్నదని ఆయన పేర్కొన్నారు. దీనిని అధిగమించటానికి కార్పొరేషన్ను ఏర్పాటు చేసి, దేశమంతటా ఆధునిక కోర్టు కాంప్లెక్సులను నెలకొల్పాల్సి ఉందన్నారు. వీటిల్లో వీడియో కాన్ఫరెన్స్ వంటి సదుపాయాలను శాశ్వత ప్రాతిపదికన ఏర్పాటు చేయాలని చెప్పారు. సీజేఐగా బాధ్యతలు చేపట్టిన తర్వాత జస్టిస్ ఎన్వీ రమణ తొలిసారిగా హైకోర్టు ప్రధాన న్యాయమూర్తులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమావేశమయ్యారు. మంగళ, బుధవారాల్లో నాలుగు సెషన్లుగా జరిగిన ఈ సమావేశం వివరాలు శుక్రవారం అధికారికంగా వెల్లడయ్యాయి. కనీస మౌలిక సదుపాయాలు లేకుండా కోర్టుల నుంచి ముఖ్యంగా దిగువ కోర్టుల నుంచి అద్భుతాలు జరుగుతాయని ఆశించలేమని, తగిన సదుపాయాలుంటేనే న్యాయసేవల్లో వేగం, నాణ్యత పెరుగుతాయని సీజేఐ పేర్కొన్నారు.
నియామకాల్లో సామాజిక వైవిధ్యం
దేశవ్యాప్తంగా హైకోర్టుల్లో ఉన్న ఖాళీలను వీలైనంత త్వరగా భర్తీ చేయటానికి చర్యలు తీసుకోవాలని హైకోర్టు చీఫ్ జస్టిస్లకు జస్టిస్ రమణ సూచించారు. దేశంలోని సామాజిక వైవిధ్యాన్ని ప్రతిబింబించేలా, సంబంధిత సిఫార్సులు అమలయ్యేలా ఈ నియామకాలు ఉండాలన్నారు. హైకోర్టు జడ్జీల నియామకాలు జరిపేటప్పుడు సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాదుల పేర్లను కూడా పరిగణనలోకి తీసుకోవాలని సూచించారు.
గ్రామీణ కోర్టుల్లో డిజిటల్ సదుపాయాలు
గ్రామీణ, గిరిజన ప్రాంతాల్లోని కోర్టుల్లో డిజిటల్ సదుపాయాలు లేక ప్రజలకు న్యాయసేవలు అందించటంలో అవాంతరాలు తలెత్తుతున్నాయని పలువురు జడ్జిలు సీజేఐ దృష్టికి తీసుకెళ్లారు. దీనిని నివారించటానికి మొబైల్ వీడియో కాన్ఫరెన్సింగ్ వ్యాన్లను ఏర్పాటుచేసుకోవాలనే ప్రతిపాదన చర్చకు వచ్చింది. కరోనా వ్యాక్సినేషన్లో న్యాయసిబ్బందికి ప్రాధాన్యం లభించేలా ప్రభుత్వంతో చర్చించాలని పలువురు జడ్జిలు కోరారు. దీనికి సీజేఐ సానుకూలంగా స్పందించారు.