కామారెడ్డి టౌన్, మే 14 : కరోనా పాజిటివ్ బారిన పడిన వారికి, ఇంటింటి సర్వేలో కరోనా లక్షణాలు ఉన్నవారికి మెడికల్ కిట్లను అందజేయాలని, హోమ్ ఐసొలేషన్లో ఉన్న వారిని నిరంతరం పర్యవేక్షించాలని కలెక్టర్ శరత్ అధికారులను ఆదేశించారు. వైద్య, రెవెన్యూ, పోలీస్, రవాణా, ఎక్సైజ్ అధికారులతో శుక్రవారం టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించి మాట్లాడారు. లక్షణాలు ఉన్నవారి పట్ల హోం ఐసొలేషన్, కమ్యూనిటీ వాచింగ్ పక్కాగా చేయాలని, వసతి లేని వారికి ప్రభుత్వం కొవిడ్ సెంటర్లలో చికిత్స అందించాలని సూచించారు. లాక్డౌన్ నిబంధనలను పకడ్బందీగా అమలుచేయాలని ఆర్డీవో, తహసీల్దార్, డీఎస్పీలకు సూచించారు. సరిహద్దు వద్ద మద్నూర్, జుక్కల్ ప్రాంతాల్లో చెక్పోస్టుల వద్ద థర్మల్ స్క్రీనింగ్ చేయాలని, లక్షణాలు ఉంటే హోమ్ ఐసొలేషన్ చేయాలని అన్నారు. ఆర్డీవోలు, డీఎస్పీలు, తహసీల్దార్లు క్షేత్రస్థాయిలో పర్యవేక్షణ చేపట్టాలని తెలిపారు. కర్ణాటక, మహారాష్ట్ర సరిహద్దుల్లో ఎక్సైజ్, రవాణా, పోలీస్, మెడికల్ బృందాలు పూర్తిస్థాయిలో చెక్పోస్ట్ పరిశీలన చేసుకోవాలని సూచించారు.
ఉపాధి హామీ కూలీల సంఖ్యను పెంచాలి
ఉపాధి హామీ పనులకు సంబంధించి కూలీల శాతం తక్కువ ఉన్న గ్రామాల్లో సోమవారంలోగా కూలీల శాతం పెంచుకోవాలని కలెక్టర్ శరత్ ఉపాధి హామీ అధికారులను ఆదేశించారు. ఉపాధి హామీలో కూలీల శాతం తక్కువ ఉన్న కామారెడ్డి, తాడ్వాయి, మద్నూర్, బిచ్కుంద, పిట్లం మండలాలకు చెందిన మండల అభివృద్ధి అధికారులు, మండల పంచాయతీ అధికారులు, ఏపీడీ, ఏపీవోలు, గ్రామ పంచాయతీ కార్యదర్శులతో సెల్ కాన్ఫరెన్స్ నిర్వహించి మాట్లాడారు. శ్రమశక్తి సంఘాలతో నీటి సంరక్షణ పనులను ప్రారంభించాలని, కరోనా సంక్షోభ సమయంలో గ్రామంలోని ప్రతి ఒక్క కూలీకి పని కల్పించే విధంగా చూడాలని సూచించారు. సమావేశంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ వెంకటేశ్ దోత్రే, జిల్లా గ్రామీణ అభివృద్ధి అధికారి బి. వెంకటమాధవరావు, జిల్లా పంచాయతీ అధికారి సాయన్న, ఏపీడీ శ్రీకాంత్ పాల్గొన్నారు.