ముంబై: కేంద్ర ప్రభుత్వం ‘రాజకీయ ఆట’లో భాగంగానే రాజీవ్ ఖేల్ రత్న అవార్డు పేరును మేజర్ ధ్యాన్ చంద్ ఖేల్ రత్న అవార్డుగా మార్చిందని శివసేన విమర్శించింది. ‘ఖేల్ రత్న’ అవార్డు పేరు మార్పును ప్రజలు కోరనప్పటికీ రాజకీయ నేపథ్యంలోనే కేంద్రంలోని బీజేపీ మార్చిందని సామ్నా పత్రిక ఎడిటోరియల్లో సోమవారం మండిపడింది. మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ త్యాగాన్ని అవమానించకుండా, భారత హాకీ లెజెండ్ ధ్యాన్ చంద్ను కేంద్రం గౌరవించి ఉంటే బాగుండేదని అభిప్రాయపడింది. భారతదేశం ఆ సంప్రదాయం, సంస్కృతిని కోల్పోయిందని ఆవేదన వ్యక్తం చేసింది.
‘పార్టీల మధ్య రాజకీయ విభేదాలు ఉండవచ్చు. ప్రజాస్వామ్యంలో ఆ వ్యత్యాసానికి ఆస్కారం ఉంది. కానీ దేశ పురోగతికి ఎంతో కృషి చేసిన ప్రధానుల త్యాగం అపహాస్యం కాకూడదు’ అని శివసేన వ్యాఖ్యానించింది. దేశానికి ఎంతో సేవ చేసి ఇందిరా గాంధీ, రాజీవ్ గాంధీ ఉగ్రదాడులకు బలైన సంగతిని గుర్తుచేసింది.
ప్రజా సెంటిమెంట్ కారణంతోనే ఖేల్ రత్న పేరును మార్చినట్లు కేంద్రం పేర్కొనడాన్ని శివసేన తప్పుపట్టింది. రాజీవ్ గాంధీ ఎప్పుడైనా హాకీ స్టిక్ చేతపట్టారా? అని కొందరు బీజేపీ నేతలు ప్రశ్నించడంలో అర్థం ఉన్నదని తెలిపింది. అయితే అహ్మదాబాద్లోని సర్దార్ పటేల్ స్టేడియం పేరును నరేంద్ర మోదీ స్టేడియంగా మార్చడాన్ని నిలదీసింది. మోదీ క్రికెట్లో ఏమైనా సాధించారా? అని శివసేన ప్రశ్నించింది. ఢిల్లీ క్రికెట్ స్టేడియం పేరును దివంగత బీజేపీ నేత అరుణ్ జైట్లీ పేరుతో మార్చడానికి కూడా ఇదే వర్తిస్తుందని ఎద్దేవా చేసింది.