2024 ఎన్నికల్లో అమలు చేసే అవకాశం: సీఈసీ అరోరా
2-3 నెలల్లో పైలట్ ప్రాజెక్టు
ఎక్కడినుంచైనా ఓటేసే అవకాశం
న్యూఢిల్లీ, మార్చి 20: మరో మూడేండ్లలో (2024లో) జరిగే లోక్సభ ఎన్నికల్లో రిమోట్ ఓటింగ్ విధానాన్ని అమలు చేసే అవకాశం ఉందని ప్రధాన ఎన్నికల కమిషనర్ (సీఈసీ) సునీల్ అరోరా వెల్లడించారు. ఓటర్లు ఎక్కడ నుంచైనా ఓటు హక్కు వినియోగించుకొనేందుకు వీలు కల్పించే ఈ రిమోట్ ఓటింగ్ కోసం ప్రస్తుతం టెక్నాలజీని అభివృద్ధి చేస్తున్నామని తెలిపారు. ఆ ఓటింగ్ ప్రక్రియను పైలట్ ప్రాజెక్టు కింద 2-3 నెలల్లో పరీక్షిస్తామని పేర్కొన్నారు. రిమోట్ ఓటింగ్ అంటే ఇంటర్నెట్ ద్వారా కానీ, ఇంటి దగ్గర నుంచి కానీ ఓటు వేయడం కాదన్నారు. అయితే ఆ ప్రక్రియలో ఎలా ఓటింగ్ నిర్వహించాలన్నదానిపై ఇంకా కసరత్తు జరుగుతున్నదని, త్వరలోనే దీనిపై నిర్ణయం తీసుకొంటామని చెప్పారు. ఐఐటీ మద్రాస్తోపాటు ఇతర ఐఐటీలు, సాంకేతిక విద్యాసంస్థలతో కలిసి ఎన్నికల సంఘం (ఈసీ) రిమోట్ ఓటింగ్ వ్యవస్థను అభివృద్ధిపరుస్తున్నది. బ్లాక్చెయిన్ టెక్నాలజీతో దీనిని అభివృద్ధి చేస్తున్నట్టు మాజీ డిప్యూటీ ఎన్నికల కమిషనర్ సందీప్ సక్సేనా తెలిపారు.
ఎస్తోనియాలో మొదటిసారి
ఇంటర్నెట్ ఓటింగ్ వ్యవస్థను మొట్టమొదటిసారిగా ఎస్తోనియా 2005లో అందుబాటులోకి తెచ్చింది. అప్పుడు 9,317 మంది ఈ విధానం ద్వారా ఓటు హక్కు వినియోగించుకొన్నారు. స్విట్జర్లాండ్, అస్ట్రేలియా, నెదర్లాండ్స్ ఇలా పలు దేశాల్లో రిమోట్ ఓటింగ్ అమల్లో ఉంది. అయితే అమలు విధానంలో దేశాల మధ్య తేడాలు ఉన్నాయి. భద్రతా కారణాల దృష్ట్యా చాలా దేశాలు ఇంటర్నెట్ ఓటింగ్ నిర్ణయాన్ని ఉపసంహరించుకొన్నాయి.
రిమోట్ ఓటింగ్ ఎలా జరుగుతుంది?
ప్రస్తుతం ప్రతిపాదనలో ఉన్న రిమోట్ ఓటింగ్ ప్రక్రియలో.. ఓటరు ఎక్కడ నివాసం ఉంటున్నా కూడా అతని సమీపంలో ఏర్పాటు చేసిన ఇంటర్నెట్ పోలింగ్ బూత్ ద్వారా ఓటేయవచ్చు. దీని కోసం ఓటరు ముందుగా రిమోట్ ఓటింగ్ కోసం తన పేరును నమోదు చేసుకోవాలి. ఇలా పేర్లు నమోదు చేసుకొన్న ఓటర్లను వారు నివాసం ఉంటున్న ప్రాంతాల వారీగా గ్రూపులుగా విభజించి వారికి సమీపంలో ఉమ్మడి పోలింగ్ బూత్ను ఏర్పాటు చేస్తారు. పోలింగ్ సమయంలో ఓటర్లకు ఇంటర్నెట్ ద్వారా ఎలక్ట్రానిక్ బ్యాలెట్ జనరేట్ అవుతుంది. ఓటర్లు తమకు కేటాయించిన బూత్కు వెళ్లి వేలిముద్రల యాక్సెస్ తీసుకొని ఓటేయవచ్చు.