న్యూఢిల్లీ: భారత పారిశ్రామిక దిగ్గజం ముఖేష్ అంబానీకి చెందిన రిలయన్స్ ఇండస్ట్రీస్ సంస్థ కరోనా వ్యాక్సినేషన్కు సంబంధించి కీలక నిర్ణయం తీసుకున్నది. తన ఉద్యోగులు, వారి కుటుంబ సభ్యులు అందరికీ ఉచితంగా వ్యాక్సిన్లు ఇవ్వాలని నిర్ణయించడం ద్వారా దేశంలోనే అతిపెద్ద కార్పొరేట్ వ్యాక్సినేషన్ డ్రైవ్కు తెరతీసింది. ఈ కార్యక్రమం ద్వారా రిలయన్స్, దాని అనుబంధ, భాగస్వామ్య (బీపీ, గూగుల్) సంస్థల్లో పనిచేస్తున్న 13 లక్షల మంది సిబ్బందికి టీకాలు వేయాలని లక్ష్యంగా పెట్టుకున్నది.
కాగా, దేశవ్యాప్తంగా మొత్తం 880 నగరాల్లో ఈ వ్యాక్సినేషన్ డ్రైవ్ కొనసాగనుంది. రిలయన్స్ ఉద్యోగులు, వారి కుటుంబ సభ్యులకు కూడా ఉచితంగానే వ్యాక్సిన్లు వేస్తామని, కంపెనీలో పనిచేస్తున్న ఉద్యోగులతో పాటు రిటైర్డ్స్ ఉద్యోగులు, వారి కుటుంబ సభ్యులకు టీకాలు వేస్తామని రిలయన్స్ ఇండస్ట్రీస్ ప్రకటించింది. వ్యాక్సిన్ల కోసం ఉద్యోగులు కోవిన్ పోర్టల్లో రిజిస్టర్ చేసుకోవాలని, అనంతరం రిలయన్స్ ఆన్లైన్ హెల్త్ కేర్ ప్లాట్ఫామ్ ‘జియో హెల్త్ హబ్’ ద్వారా సమీపంలోని వ్యాక్సినేషన్ సెంటర్లో స్లాట్ బుక్ చేసుకోవాలని రిలయన్స్ ఇండస్ట్రీస్ సూచించింది.
ఒకవేళ ఇప్పటికే ఎవరైనా ఉద్యోగులు వ్యాక్సిన్ వేయించుకుంటే, దానికి అయిన ఖర్చులను కంపెనీ చెల్లిస్తుందని రిలయన్స్ ఇండస్ట్రీస్ ప్రకటించింది. రిలయన్స్కు చెందిన దాదాపు 3.40 లక్షల మంది ఇప్పటికే మొదటి డోస్ టీకా తీసుకున్నట్లు రిలయన్స్ వర్గాలు తెలిపాయి. జూన్ 15 నాటికి రిలయన్స్ ఉద్యోగులందరూ కనీసం మొదటి టీకా వేసుకునేలా రిలయన్స్ సంస్థ లక్ష్యాన్ని నిర్దేశించుకున్నది. రిలయన్స్ ఉద్యోగులతోపాటు 13,000 వేల రిలయన్స్ రిటైల్, జియో స్టోర్ సిబ్బందికి కూడా ఈ ప్రోగ్రామ్ కింద టీకాలు వేయనున్నట్లు తెలిపింది.
ప్రైవేట్ సంస్థలు వ్యాక్సిన్లను కొనుగోలు చేసేందుకు ప్రభుత్వం అనుమతి ఇచ్చిన తర్వాత భారత్ బయోటెక్ (కోవాగ్జిన్), సీరం ఇన్స్టిట్యూట్ (కొవిషీల్డ్) నుంచి రిలయన్స్ సంస్థ పెద్ద ఎత్తున వ్యాక్సిన్లు కొనుగోలు చేసింది. ముంబైతో పాటు మానుఫ్యాక్చరింగ్ లొకేషన్స్లో ఇప్పటికే వ్యాక్సినేషన్ డ్రైవ్ ప్రారంభమైంది. మరో వారం రోజుల్లో ఇతర నగరాల్లోనూ ప్రారంభించనున్నారు. రిలయన్స్ ఉద్యోగులు ఎక్కువగా ఉన్న నగరాల్లో ఇప్పటికే పలు ఆస్పత్రులతో వ్యాక్సినేషన్ కోసం ఒప్పందం కుదుర్చుకుంది.