న్యూఢిల్లీ: కరోనా వ్యాక్సిన్లను మే 1 నుంచి 18 ఏళ్లు పైబడిన అందరికీ ఇస్తున్న సంగతి తెలుసు కదా. అయితే 18 నుంచి 45 ఏళ్ల మధ్య వయసున్న వాళ్లు వ్యాక్సిన్ కోసం CoWIN వెబ్పోర్టల్లో తప్పనిసరిగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలని అధికార వర్గాలు స్పష్టం చేశాయి. నేరుగా వెళ్లి వ్యాక్సిన్ తీసుకోవడం కుదరదని తెలిపాయి. 45 ఏళ్ల పైన ఉన్న వాళ్లు మాత్రం వ్యాక్సినేషన్ కేంద్రంలోనే రిజిస్ట్రేషన్ చేసుకొని అప్పటికప్పుడు వ్యాక్సిన్ తీసుకోవచ్చని అధికారులు స్పష్టం చేశారు.
18 ఏళ్లు నిండిన అందరికీ అంటే ఒక్కసారిగా వ్యాక్సిన్కు డిమాండ్కు పెరిగే అవకాశం ఉంది. ఒకేసారి అందరూ వ్యాక్సిన్ కేంద్రాలకు రాకుండా.. CoWIN పోర్టల్లో అపాయింట్మెంట్ బుక్ చేసుకోవడం తప్పనిసరి చేశాము. కనీసం ప్రారంభంలో అయితే నేరుగా వచ్చే వాళ్లకు వ్యాక్సిన్ వేయడం కుదరదు అని ఓ సీనియర్ అధికారి చెప్పారు. ఈ నెల 28 నుంచి ఆరోగ్య సేతు యాప్, CoWINలలో వ్యాక్సిన్ రిజిస్ట్రేషన్ ప్రక్రియ ప్రారంభమవుతుంది.