ముంబై: మహరాష్ట్రలో కరోనా మహమ్మారి విలయతాండవం చేస్తున్నది. రాజధాని ముంబైలో అయితే పరిస్థితి మరింత దారుణంగా ఉన్నది. ఈ నేపథ్యంలో ముంబై నగరంలో హెల్త్కేర్ సిబ్బందే ఇంటింటికి వెళ్లి టీకాలు వేస్తారని గత రెండు మూడు రోజులుగా ప్రచారం జరుగుతున్నది. అయితే ఈ ప్రచారానికి ముంబై మేయర్ కిశోరీ పెడ్నేకర్ తెరదించారు.
ముంబైలో హెల్త్కేర్ సిబ్బందే ఇంటింటికీ తిరిగి కరోనా వ్యాక్సిన్ ఇచ్చేందుకు తాము ఎలాంటి ప్రణాళిక సిద్ధం చేయలేదని కిశోరీ పెడ్నేకర్ స్పష్టంచేశారు. కానీ నగరంలోని పలు ప్రాంతాల్లో మొబైల్ వ్యాన్లను ఏర్పాటు చేసి టీకాలు ఇస్తామని చెప్పారు. అయితే నేరుగా వచ్చే వారికి టీకాలు ఇవ్వరని, టీకా తీసుకునే వారు ముందుగా కొ-విన్ యాప్ ద్వారా దరఖస్తు చేసుకోవాలని ముంబై మేయర్ సూచించారు.