న్యూఢిల్లీ: కొత్తగా అభివృద్ధి చేసిన సెంట్రల్ విస్టా( Central Vista )లోనే వచ్చే ఏడాది రిపబ్లిక్ డే పరేడ్ జరుగుతుందని చెప్పారు కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పూరి. రెండున్నర నెలల్లో ఈ ప్రాజెక్ట్ పూర్తవుతుందని అన్నారు. అంతేకాదు వచ్చే ఏడాది పార్లమెంట్ శీతాకాల సమావేశాలు కొత్త పార్లమెంట్ బిల్డింగ్లోనే జరుగుతాయని కూడా ఆయన వెల్లడించారు. అటు కేంద్ర హౌజింగ్ అండ్ అర్బన్ అఫైర్స్ మినిస్ట్రీ కూడా ఈ ప్రాజెక్ట్ సమయానికే పూర్తవుతుందని, 2022 రిపబ్లిక్ డే పరేడ్ వేడుకలకు ఆతిథ్యమిస్తుందని చెబుతోంది. 7 వేల మందికిపైగా ఉన్న రక్షణ మంత్రిత్వ శాఖ, సాయుధ బలగాల ఉద్యోగుల కోసం కస్తూర్బా గాంధీ మార్గ్, ఆఫ్రికా అవెన్యూలో నిర్మించిన రెండు బహుళ అంతస్తుల భవనాల ప్రారంభోత్సవం సందర్భంగా హర్దీప్ సింగ్ పూరి ఈ వ్యాఖ్యలు చేశారు.
గురువారం ఉదయం ప్రధాని నరేంద్ర మోదీ ఈ రెండు భవనాలను ప్రారంభించారు. వీటి నిర్మాణం కేవలం 12 నెలల్లోనే పూర్తయినట్లు హర్దీప్ చెప్పారు. ఈ ప్రాజెక్ట్ 6.4 లక్షల ఉపాధి పని దినాలను కల్పించినట్లు తెలిపారు. సెంట్రల్ విస్టా ప్రాజెక్ట్లో భాగంగా కొత్త పార్లమెంట్ బిల్డింగ్, సెక్రటేరియట్, 3 కి.మీ. రాజ్పథ్ మార్గం పునరుద్ధరణ, కొత్త ప్రధానమంత్రి నివాసం, పీఎంవో, కొత్త ఉపాధ్యక్షుడి ఎన్క్లేవ్ నిర్మిస్తున్నారు.