న్యూఢిల్లీ: దేశంలో కరోనా మహమ్మారి ప్రభావం చాలావరకు తగ్గింది. అయినా రోజూ 15 లక్షలకు తగ్గకుండా కొవిడ్ పరీక్షలు నిర్వహిస్తున్నారు. పరీక్షలు భారీగా నిర్వహిస్తున్నా పాజిటివిటీ రేటు అంతకంతకే పడిపోతూ రికవరీ రేటు పెరుగుతూ వస్తున్నది. ప్రతిరోజూ పెద్ద సంఖ్యలో బాధితులు మహమ్మారి బారి నుంచి కోలుకుంటుండటంతో రికవరీ రేటు 95.80 శాతానికి చేరింది.
అయితే, అదే సమయంలో పాజిటివిటీ రేటు తగ్గుతూ వచ్చింది. వీక్లీ పాజిటివిటీ రేటు 5 శాతం దిగువకు చేరి ప్రస్తుతం 4.17 శాతంగా ఉన్నది. అదేవిధంగా గత 9 రోజులుగా డెయిలీ పాజిటివిటీ రేటు 5 శాతం కంటే తక్కువగానే నమోదవుతూ వస్తున్నది. మంగళవారం పాజిటివిటీ రేటు 3.22 శాతంగా ఉన్నది. కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ ఈ వివరాలను మీడియాకు వెల్లడించింది.