పద్మ అవార్డుల కోసం పేర్లను పంపండి.. రాష్ట్రాలకు కేంద్రహోంశాఖ లేఖ
న్యూఢిల్లీ, జూన్ 4: వివిధ రంగాల్లో గొప్ప సేవలు అందిస్తూ అంతగా ప్రచారంలోకి రాని విశిష్ట వ్యక్తులను గుర్తించి పద్మ అవార్డుల కోసం నామినేట్ చేయాలని రాష్ట్రాలను కేంద్రప్రభుత్వం కోరింది. ఈ వ్యక్తులను గుర్తించేందుకు ప్రత్యేకంగా సెర్చ్ కమిటీలను ఏర్పాటు చేయాలని సూచించింది. వచ్చే ఏడాది గణతంత్ర దినోత్సవం సందర్భంగా ప్రకటించే పద్మ అవార్డులకు దరఖాస్తులను కేంద్రం ఆహ్వానించింది. సెప్టెంబర్ 15 వరకూ ఆన్లైన్ పోర్టల్ padmaawards.gov.inలో దరఖాస్తులను స్వీకరించనున్నారు. ఈ నేపథ్యంలోనే రాష్ట్రాలు, కేంద్రపాలితప్రాంతాల ప్రధాన కార్యదర్శులకు కేంద్రహోంశాఖ శుక్రవారం ఒక లేఖను పంపించింది.