మనల్ని కాపాడే రోగనిరోధకవ్యవస్థే మనకు శత్రువుగా మారితే.. ప్రస్తుతం కరోనా విజృంభణలో అదే జరుగుతున్నది. కరోనా వైరస్పై పోరాడే యాంటీబాడీలు ఆ వైరస్లాగే ఉండే సాధారణ కణాలపై కూడా దాడి చేసి ధ్వంసం చేస్తున్నాయి. దీనిని అడ్డుకోకుండా.. దగ్గు, శ్వాస సమస్యలకు కారణం నిమోనియా అని భావించి చికిత్స అందిస్తుండటం వల్ల పరిస్థితి విషమించి ప్రాణాలు పోతున్నాయని ఢిల్లీలో ప్రజావైద్యుడిగా పేరొందిన, సెయింట్ స్టీఫెన్స్ హాస్పిటల్ మాజీ డైరెక్టర్ డాక్టర్ మాథ్యూ వర్ఘీస్ వెల్లడించారు. కరోనా బారిన పడినా కూడా సరైన సమయంలో సరైన చికిత్సతో బయటపడవచ్చని చెబుతున్నారు. వివరాలు ఆయన మాటల్లోనే..
దేశంలో కరోనా బారిన పడినవారిలో 80% మంది తొలి 3-4 రోజుల్లో గొంతునొప్పి, జ్వరం, దగ్గు, ఒళ్లునొప్పులు, తలనొప్పి అరుదుగా విరేచనాలు వంటి లక్షణాలతో బాధపడి ఆ తర్వాత దాన్నించి బయటపడుతున్నారు. కానీ, మిగిలిన 15-20% మందిలోనే సమస్య తీవ్రమవుతున్నది. వీరిలో ఐదురోజుల తర్వాత కూడా జ్వరం తగ్గకపోవటం, దగ్గు తీవ్రం కావటం, శ్వాస తీసుకోవటం కష్టం కావటం జరుగుతోంది. వీరికే సరైన సమయంలో సరైన చికిత్స అందించటం కీలకం. అయితే, ఇక్కడ సాధారణంగా జరుగుతున్న పొరపాటు ఏమిటంటే.. రోగి ఛాతీ ఎక్స్రే చూసి నిమోనియా సోకిందని భావించి ఆ చికిత్స ప్రారంభిస్తున్నారు. కానీ, ఇది నిమోనియా కాదు. ఇటలీలో కరోనా మృతులపై జరిగిన పోస్ట్మార్టం పరిశోధనల వల్ల తేలిందేమిటంటే.. దగ్గు, శ్వాస సమస్య వంటివి నిమోనియా కారణంగా రావటం లేదు. ఊపిరితిత్తుల్లోని రక్తనాళాల్లో రక్తం గడ్డకట్టుకుపోవటంతో ఈ సమస్య తలెత్తుతున్నదని వారు గుర్తించారు.
స్వీయవిధ్వంసానికి పాల్పడుతున్న ఇమ్యూనిటీని నియంత్రించటానికి స్టెరాయిడ్లు తీసుకోవాలి. అదే సమయంలో రక్తం గడ్డ కట్టకుండా ఉండటానికి వీలైన (యాంటీక్లాటింగ్) ఔషధాలను తీసుకోవాలి. స్టెరాయిడ్లతోపాటు కొందరు ఆస్పిరిన్ వాడుతున్నారు. కానీ, ఆస్పిరిన్ పనికిరాదు. స్టెరాయిడ్లను పది రోజులు వాడాలి. యాంటీక్లాటింగ్ ఔషధాలను 3వారాలపాటు వాడాలి. ఇదంతా వైద్యుడి పర్యవేక్షణలోనే జరగాలి.
తొందరపాటు ప్రమాదకరం
స్టెరాయిడ్లను ఏ సమయంలో వాడాలన్నది చాలా ముఖ్యమైన విషయం. కొందరు కరోనా లక్షణాలు ప్రారంభమైన వెంటనే 2-3 రోజుల్లోనే స్టెరాయిడ్లను తీసుకుంటున్నారు. దీనివల్ల, శరీరంలో కరోనా వైరస్పై పోరాటాన్ని ప్రారంభించిన రోగనిరోధకవ్యవస్థను అడ్డుకున్నవాళ్లమవుతాం. కాబట్టి, 5-6 రోజుల్లో కూడా కోలుకోనివారు స్టెరాయిడ్లను వాడొచ్చు.
ఆ దశలో నిమోనియా చికిత్స అవసరం
స్టెరాయిడ్ల వాడకంతో 4-5 రోజుల్లో పరిస్థితి మెరుగవుతుంది. కానీ, 1-2 రోజుల్లో మళ్లీ జ్వరం, దగ్గు వంటివి రావొచ్చు. దీన్ని చూసి మళ్లీ వైరస్ దాడి మొదలైందని అనుకుంటారు. కానీ, అది నిజం కాదు. స్టెరాయిడ్ల వాడకం వల్ల ఇమ్యూనిటీ మందగిస్తుంది. ఊపిరితిత్తుల్లో సహజంగా ఉండే బ్యాక్టీరియా.. ఇమ్యూనిటీ క్షీణించటంతో శరీరంపై దాడిని ప్రారంభిస్తుంది. దీనివల్ల మళ్లీ జ్వరం, శ్వాస సమస్య తలెత్తుతాయి. ఇది నిమోనియా అని గుర్తించాలి. యాంటీబయోటిక్లతో దీన్నించి బయటపడవచ్చు.
ఎప్పుడు సోకిందన్నది అత్యంత కీలకం
కరోనా వైరస్ ఒకసారి శరీరంలోని కణాల్లోకి ప్రవేశించిన తర్వాత దాని సంఖ్యను వేగంగా పెంచుకుంటూ ఉంటుంది. కాబట్టి, ఏ రోజు నుంచి కరోనా లక్షణాలు ప్రారంభమయ్యాయి అన్నది నమోదు చేసుకోవాలి. దీనివల్ల శరీరంలో కరోనా వైరస్ ఏ స్థాయిలో పెరిగి ఉంటుంది, దానికి ఎటువంటి చికిత్స అందించాలన్నది నిర్ణయించటం సులభం అవుతుంది. సాధారణంగానైతే వైరస్ ప్రవేశించి లక్షణాలు బయటపడి, తీవ్రతరం కావటం లేదా దాన్నించి ఆ వ్యక్తి కోలుకోవటం అన్నది తొలి ఐదురోజుల్లో (రెండురోజులు అటూ ఇటుగా) జరుగుతున్నది.