కూకట్పల్లి హెచ్డీఎఫ్సీ కాల్పుల ఘటన మిస్టరీ వీడినా.. ఓ దొంగ మాత్రం పోలీసులకు చిక్కడంలేదు..ఇప్పటికే ఇద్దరు దుండగుల్లో ఒకరు పోలీసుల అదుపులో ఉన్నట్లు సమాచారం.. మరొకరు దొరకకపోవడంతో ఈ కేసు దర్యాప్తు ఆలస్యమవుతున్నది. పరారీలో ఉన్న దుండగుడి వద్ద ఐదు లక్షల నగదు, తుపాకీ ఉండటంతో అతడి కోసం పోలీసులు తీవ్రంగా గాలిస్తున్నారు.. దోపిడీ ఘటన తర్వాత ఇద్దరు దుండగులు సికింద్రాబాద్లో రైలు ఎక్కి పరారయినట్లు పోలీసుల ప్రాథమిక దర్యాప్తులో తేలింది. మరో దుండగుడు పోలీసులకు చిక్కినట్లు తెలిసినప్పటికీ అధికారులు మాత్రం అధికారికంగా ధ్రువీకరించడం లేదు. అయితే.. అతడి నుంచి స్వాధీనం చేసుకున్న బైక్ రాచకొండ పోలీసు కమిషనరేట్ పరిధిలో చోరీకి గురైందని పోలీసులు గుర్తించారు. ఆ వివరాలను రాబట్టినప్పటికీ పరారీలో ఉన్న దుండగుడిని పట్టుకునేందుకు సైబరాబాద్ పోలీసులు గాలింపును ముమ్మరం చేశారు. ఇందులో భాగంగా బిహార్లోని అతని ఇంటితో పాటు అతను తలదాచుకునే ప్రాంతాలను పోలీసులు గుర్తించి.. నిఘా పెట్టినప్పటికీ అతను మాత్రం ఇంకా ఇంటికి వెళ్లలేదని తేలింది. దీంతో పోలీసులు అతడిని పట్టుకునేందుకు అదుపులో ఉన్న దొంగ ఇస్తున్న సమాచారం మేరకు గాలిస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఈ దుండుగులు చేసిన నేరాల చిట్టా పోలీసుల వద్ద ఉండటంతో.. ఇక రెండో నిందితుడు చిక్కితే మరికొన్ని విషయాలు వెలుగులోకి రానున్నాయి.