న్యూఢిల్లీ: రైతులతో చర్చలు జరిపేందుకు సిద్ధంగా ఉన్నట్లు కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ తెలిపారు. వ్యవసాయ చట్టాల్లోని సమస్యలను పాయింట్ వారీగా తెలియజేస్తే వాటిపై చర్చలు జరుపుతామని గురువారం అన్నారు. వ్యవసాయ చట్టాలు రైతులకు అనుకూలమని, వారికి ఎంతో లబ్ధి కలిగిస్తాయని మరోసారి వెల్లడించారు. పార్లమెంట్ వర్షాకాల సమావేశాల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వంపై మరింత ఒత్తిడి తెచ్చేందుకు రైతులు సిద్ధమైన నేపథ్యంలో వారితో చర్చలకు ప్రభుత్వం సిద్ధమేనని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ స్పష్టం చేశారు.
మరోవైపు జంతర్ మంతర్ వద్దకు చేరిసన రైతులు గురువారం అక్కడ ‘రైతు పార్లమెంట్’ను నిర్వహించారు. వ్యవసాయ చట్టాలపై నిరసనలో అమరులైన అన్నదాతలకు నివాళి అర్పించారు. కార్పొరేట్ సంస్థలకు లబ్ధి చేకూర్చేలా ఉన్న మూడు వ్యవసాయ చట్టాలను కేంద్ర ప్రభుత్వం వెనక్కి తీసుకోవాలని మరోసారి డిమాండ్ చేశారు. పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు జరిగే వరకు జంతర్ మంతర్ వద్ద నిరసన కొనసాగిస్తామని రైతు నేతలు స్పష్టం చేశారు.