ముంబై, మే 5: కరోనా సెకండ్ వేవ్ దేశాన్ని తీవ్ర సంక్షోభంలోకి నెడుతున్నదని రిజర్వు బ్యాంక్(ఆర్బీఐ) ఆందోళన వ్యక్తం చేసింది. ఈ సంక్షోభం నుంచి దేశాన్ని గట్టెక్కించేందుకు అవసరమైన అన్ని చర్యలు చేపడుతున్నామని తెలిపింది. ఇందులో భాగంగా ఎంపిక చేసిన వ్యక్తిగత రుణాలతోపాటు చిన్న తరహా పరిశ్రమల రుణాలపై రెండేండ్లు మారటోరియం విధిస్తున్నట్లు ప్రకటించింది. దేశంలో కొవిడ్-19 కేసులు విపరీతంగా పెరుగుతున్న నేపథ్యంలో వైద్య రంగానికి సంబంధించిన మౌలిక సదుపాయాలు, వ్యాక్సిన్ తయారీదారులకు రుణాల మంజూరులో ప్రాధాన్యమివ్వాలని బ్యాంకులకు సూచించింది. అంతేకాకుండా కొవిడ్ సంబంధ వైద్య విభాగాలకు అండగా నిలిచేందుకు రూ.50 వేల కోట్ల ప్రత్యేక నిధులను అందుబాటులోకి తీసుకొస్తున్నట్లు ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ వెల్లడించారు. బ్యాంకులు ఈ నిధులను వ్యాక్సిన్ తయారీ కంపెనీలకు, దవాఖానల్లో వైద్య సదుపాయాల మెరుగుదలకు రుణాలుగా ఇవ్వొచ్చని తెలిపారు. మూడేండ్ల వరకు కాలపరిమితిని కలిగి ఉండే ఈ రుణ పథకం కింద బ్యాంకులు ప్రత్యేకంగా ‘కొవిడ్ లోన్ బుక్’ను ఏర్పాటు చేసుకోవచ్చన్నారు.
స్మాల్ ఫైనాన్స్ బ్యాంకు (ఎస్ఎఫ్బీ)లకు రూ.10 వేల కోట్ల దీర్ఘకాలిక రుణాలను ఇచ్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు ఆర్బీఐ గవర్నర్ వెల్లడించారు. గతేడాది రుణ పునర్వ్యవస్థీకరణ సదుపాయాన్ని వినియోగించుకోనివారు రెండేండ్లపాటు మారటోరియంను పొందే అవకాశం కల్పిస్తున్నామని, రూ.25 కోట్లలోపు రుణాలున్నవారికి ఈ సదుపాయం అందుబాటులో ఉంటుందని తెలిపారు. ప్రస్తుతం భారత్ వద్ద 588 బిలియన్ డాలర్ల (రూ.43,40,116 కోట్ల) విలువైన విదేశీ మారకద్రవ్య నిల్వలున్నాయని, వీటితో సంక్షోభాలను ఎదుర్కోగలిగే శక్తి లభిస్తుందని చెప్పారు.
రాష్ట్ర ప్రభుత్వాలకు రిజర్వు బ్యాంక్ శుభవార్తను అందించింది. రాష్ట్ర ప్రభుత్వాలకు ఇచ్చే ఓవర్ డ్రాఫ్ట్(ఓడీ) సదుపాయాలను మరింత సరళతరం చేస్తూ నిర్ణయం తీసుకున్నది. ఇప్పటివరకు 36 రోజులుగా ఉన్న ఓడీ గడువును 50 రోజులకు పొడిగించినట్లు శక్తికాంత దాస్ తాజాగా ప్రకటించారు. దీంతో కరోనాతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న రాష్ట్ర ప్రభుత్వాలకు ఊరట లభించినట్లు అవుతున్నది. మరోవైపు ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2021-22)లో సాధారణ వర్షపాతం నమోదవుతుందని వాతావరణ శాఖ అంచనా వేసినందున గ్రామీణ ప్రాంతాల్లో డిమాండ్ పెరిగి ద్రవ్యోల్బణంపై ఒత్తిడి తగ్గుతుందని ఆయన ఆశాభావాన్ని వ్యక్తం చేశారు.
మరోవైపు కేవైసీ నిబంధనలను ఆర్బీఐ సడలించింది. ఈ ఏడాది డిసెంబర్ చివరి వరకు కేవైసీ వివరాలను సమర్పించడంలో విఫలమైన కస్టమర్లపై ఎలాంటి చర్యలు చేపట్టవద్దని బ్యాంకులు, ఇతర ఆర్థిక సంస్థలకు ఆర్బీఐ స్పష్టం చేసింది. అంతేకాకుండా ప్రొప్రైటర్షిప్ సంస్థలు, ఆథరైజ్డ్ సిగ్నేటరీల్లాంటి కొత్త క్యాటగిరీలకు చెందిన కస్టమర్ల సౌలభ్యం కోసం వీడియో కేవైసీ లేదా వీ-సిప్ పరిధిని పెంచాలని కూడా ఆర్బీఐ నిర్ణయించింది.