కరోనాతో ఎవరికి వారే ఇంట్లోనే మెడిటేషన్
తొగుట, మే 9: బిజీ ప్రపంచంలో క్షణం తీరిక లేక మానసిక ప్రశాంతతకు నోచుకోక రోగాలతో మదనపడుతున్న వారికి పిరమిడ్ ధ్యాన కేంద్రాలు ఎంతో ఉపశమనాన్ని కలిగిస్తున్నాయి. 2010లో తొగుటలో వెంకటేశ్వర పిరమిడ్ ధ్యాన కేంద్రాన్ని ఏర్పాటు చేసి సుభాష్ పత్రీజీ చేతుల మీదుగా ప్రారంభించారు. నాటి నుంచి నేటి వరకు ధ్యాన కేంద్రం నిర్విరామంగా కొనసాగుతుండగా, ప్రస్తుతం కరోనా వ్యాప్తి విస్తరిస్తుండడంతో ఎవరికి వారే ఇంట్లోనే ధ్యానం చేసుకుంటున్నారు.
ధ్యానంతో సంపూర్ణ ఆరోగ్యం
ధ్యానంతో ప్రశాంతత చేకూరుతుండడంతో ధ్యాన కేంద్రాలకు వెళ్లేవారి సంఖ్య రోజురోజుకూ పెరుగుతున్నది. తొగుటలో సుభాష్ పత్రీజీ ఆశీస్సులతో పురుడు పోసుకున్న వెంకటేశ్వర పిరమిడ్ ధ్యాన కేంద్రానికి అనతి కాలంలోనే ధ్యానం చేసే సాధకులు పెరగడంతో మంచి ఫలితాలు సాధించింది.
శ్వాసపై ధ్యాసతోనే నియంత్రణ
కరోనా సమయం కాబట్టి, ప్రతి ఒక్కరూ ఇంట్లోనే ధ్యానం చేసుకుంటున్నారు. ప్రశాంతంగా కూర్చొని చేతులు రెండు వేళ్లలోకి వేళ్లు కలుపుకొని కళ్లు మూసుకొని సహజ సిద్ధంగా మనలో జరుగుతున్న ఉశ్వాస, నిశ్వాసలను గమనిస్తూ శ్వాసపై దృష్టి పెట్టాలి. మధ్యమధ్యలో వచ్చే ఆలోచనలను దూరం చేస్తూ శ్వాసపై ఏకాగ్రత పెంచాలి. ఇలా చేస్తూ పోతే కొద్ది సమయంలోనే మనస్సు ఆలోచనా రహిత స్థితిలోకి చేరి శూన్యం ఏర్పడుతుంది. ఈ స్థితిలో విశ్వంలో ఉన్న విశ్వమయ ప్రాణశక్తి శరీరంలోకి ప్రవేశించి నాడీ మండలాన్ని శుద్ధి చేస్తుంది. దీంతో శ్వాసపై ధ్యాస పెరుగుతుండటంతో పాటు శరీరం తేలికవుతుంది. భారం తగ్గి ఆరోగ్యం చేకూరుతుంది.
మానసిక ప్రశాంతత పెరుగుతుంది..
10 సంవత్సరాలుగా వెంకటేశ్వర పిరమిడ్ ధ్యాన సొసైటీ ద్వారా ప్రజల్లో ధ్యానంపై అవగాహన కల్పిస్తున్నాం. ధ్యానంతో మానసిక ప్రశాంతత చేకూరుతుంది. ప్రస్తుతం కరోనా సోకిన వారు కూడా ధ్యానం చేస్తూ మనసును ప్రశాంతం, ఎటువంటి భయానికి గురయ్యే ఆలోచనలు రాకుండా ఉండవచ్చు.
సద్గుణాచారి సొసైటీ నిర్వాహకుడు