పర్యాటక అభివృద్ధి సంస్థ పరిశోధనాధికారి కావూరి శ్రీనివాస్శర్మ
హైదరాబాద్, ఏప్రిల్ 18 (నమస్తే తెలంగాణ): చారిత్రక సంపద, వారసత్వ విశేషాలకు పుట్టినిల్లు తెలంగాణ. నిజాం కాలంలో నిర్లక్ష్యానికి గురై.. ఉమ్మడి రాష్ర్టంలో ప్రాభవాన్ని కోల్పోయిన తెలంగాణ చారిత్రక సంపద స్వరాష్ట్రంలో వెలుగులోకి వస్తున్నది. రాష్ట్ర పర్యాటక అభివృద్ధి సంస్థ పరిశోధన అధికారి డాక్టర్ కావూరి శ్రీనివాస్శర్మ పలు ప్రాచీన తాళపత్రాలను బయటకు తీసి వాడుకభాషలోకి అనువదించడం ద్వారా రానున్న తరాలకు అందించేందుకు కృషిచేస్తున్నారు. ఆదివారం ప్రపంచ వారసత్వ సంపద దినోత్సవం సందర్భంగా ఆయన మాట్లాడారు. తెలంగాణలో పురావస్తు సంపదకు కొదవలేదని, అనేక ప్రాచీన తాళపత్ర గ్రంథాలు, శాసనాలు ఇక్కడ ఉన్నాయని తెలిపారు. ఇప్పటికే సంస్కృతం, గ్రాంధికభాషలో ఉన్న పలు తాళపత్ర గ్రంథాలను తెలుగులోకి అనువదించామని, మరో మూడుగ్రంథాలు త్వరలో రాబోతున్నాయని వివరించారు. ఇందులో వైద్య నిఘంటువు ఆయుర్వేద తాళపత్ర గ్రంథం(ధన్వంతరి విజయం), కపిల మహర్షి జ్యోతిషగ్రంథమైన జ్యోతిష కల్పలత, మంత్రశాస్త్రం దుర్గా సప్తశతి మంత్ర కదంబం ఉన్నాయని అన్నారు.