జిలిటెన్స్టిక్స్, డిటోనేటర్లను నిర్వీర్యం చేస్తుండగా ప్రమాదం
పోలీసులకు తప్పిన ప్రాణాపాయం
మంగళగూడెంలో ఘటన
ఖమ్మం రూరల్, జూలై 8: ఖమ్మం రూరల్ మండలం మంగళగూడెం, తనగంపాడు గ్రామాల మధ్య గురువారం భారీ పేలుడు సంభవించింది. దీంతో సమీప ఆయా గ్రామాల ప్రజలు ఒక్కసారిగా ఉలిక్కి పడ్డారు. వేర్వేరు కేసుల్లో పోలీసులకు పట్టుబడిన పేలుడు సామగ్రిని నిర్వీర్యం చేస్తుండగా ఈ ఘటన సంభవించింది. తెలిసిన వివరాల ప్రకారం.. అనేక కేసుల్లో పట్టుబడిన జిలటిన్ స్టిక్స్, డిటోనేటర్లతో పాటు ఇతర పేలుడు సామగ్రిని కోర్టు ఉత్తర్వులు ప్రకారం నిర్వీర్యం చేయాలని ఖమ్మం రూరల్ పోలీసులు గురువారం నిర్ణయించారు. దీనిలో భాగంగా జేసీబీతో జిలిటిన్ స్టిక్స్, డిటోనేటర్లను నిర్వీర్యం చేసిన తర్వాత బ్లాక్పౌడర్ బస్తాలను నిర్వీర్యం చేస్తున్న క్రమంలో ఒక్కసారిగా భారీ పేలుడు సంభవించింది. ఈ శద్దం కొన్ని మీటర్ల వరకు వినిపించడంతో సమీప గ్రామాల ప్రజలు ఒక్కసారిగా ఉలిక్కి పడ్డారు. ప్రమాద ఘటనలో ఒకరిద్దరు పోలీస్ సిబ్బంది స్వల్ప గాయాల పాలైనట్లు తెలుస్తున్నది. ఘటనా స్థలాన్ని రూరల్ సీఐ సత్యనారాయణరెడ్డి పరిశీలించారు. విస్ఫోటం గురించి ఉన్నాధికారులకు నివేదించారు. ప్రమాదంపై సీఐను వివరణ కోరగా ఘటనలో ఎవరికీ గాయాలు కాలేదని, కేవలం జేసీబీ మాత్రమే ధ్వంసం అయిందన్నారు.