లక్నో: అయోధ్యలో 70 ఎకరాల సుదీర్ఘ విస్తీర్ణంలో నిర్మిస్తున్న రామమందిరం 2025 చివరికల్లా పూర్తవుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు. అయితే అంతకు రెండేండ్లు ముందుగా అంటే 2023, డిసెంబర్ నాటికి గర్భగుడి నిర్మాణం పూర్తవుతుందని, గర్భగుడి నిర్మాణం పూర్తయిన వెంటనే భక్తులకు ప్రవేశం కల్పిస్తారని అయోధ్య రామాలయ వర్గాలు వెల్లడించాయి. అంటే ఆలయ వర్గాలు వెల్లడించిన వివరాల ప్రకారం.. భక్తులు 2023 డిసెంబర్ నుంచి అయోధ్యలో పూజలు చేయవచ్చన్నమాట.
ఛైర్మన్ నృపేంద్ర మిశ్రా అధ్యక్షతన సమావేశమైన శ్రీ రామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. అయోధ్యలో రామాలయం నిర్మాణం కోసం ప్రధాని నరేంద్రమోదీ గత ఏడాది ఆగస్టు 5న పునాది రాయి వేశారు. అయితే భారీగా వరదనీరు నిలువడంతో ఈ ఏడాది జనవరిలో పనులకు అంతరాయం ఏర్పడింది. ప్రస్తుతం ఆలయ పునాది నిర్మాణం జరుగుతున్నది. వచ్చే నెల 15 కల్లా పునాది నిర్మాణం పూర్తవుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు.