న్యూఢిల్లీ : వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతు సంఘాలు బుధవారం బ్లాక్ డేకు పిలుపు ఇచ్చిన క్రమంలో రైతులు గుమికూడరాదని, బహిరంగ సభలు నిర్వహించరాదని బీకేయూ నేత రాకేష్ తికాయత్ సూచించారు. రైతులు ఢిల్లీ దిశగా ప్రదర్శనలు చేపట్టవద్దని కోరారు. బ్లాక్ డే సందర్భంగా బుధవారం రైతులు వారున్న చోటే నల్ల జెండాలు ఎగురవేస్తారని ఆయన పేర్కొన్నారు.
ఆరు నెలలుగా ఢిల్లీ సరిహద్దుల్లో రైతుల నిరసనలు సాగుతున్నా నల్ల చట్టాలను ప్రభుత్వం ఇంతవరకూ వెనక్కితీసుకోలేదని రాకేష్ తికాయత్ మండిపడ్డారు. మరోవైపు రైతుల ఆందోళన జరుగుతున్న ప్రాంతాల్లో కరోనా కట్టడికి ఎలాంటి చర్యలు తీసుకున్నారో తెలుపుతూ నివేదికలు సమర్పించాలని జాతీయ మానవ హక్కుల కమిషన్ ఢిల్లీ, హర్యానా, యూపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులకు నోటీసులు జారీ చేసింది.