గత సంవత్సరం ఇదే రోజున జనతా కర్ఫ్యూ
వెనువెంటనే దేశవ్యాప్త లాక్డౌన్
యావత్ ప్రపంచాన్ని గడగడలాడించిన కొవిడ్ -19
ప్రస్తుతం భయం కరిగింది.. కరోనా మిగిలింది
సమాజానికి పాఠాలు నేర్పిన మహమ్మారి
బంధాలను ఛిద్రం చేసి .. మనుషులను దూరం చేసిన వైరస్
అంత్యక్రియలకు ఆ నలుగురూ కరువే..
తేరుకుంటున్న వేళ మరోమారు వైరస్ విజృంభణ
నిజామాబాద్, మార్చి 21, (నమస్తే తెలంగాణ ప్రతినిధి): కంటికి కనిపించని కరోనా చిన్నా..పెద్దా అనే తేడా లేకుండా ఎవ్వరినీ వదల్లేదు. మనుషుల మధ్య దూరం పెంచిన మహమ్మారి అంత్యక్రియల సమయంలో పాడె మోసేందుకు ఆ నలుగురిని సైతం దూరం చేసింది. లాక్డౌన్తో ఉపాధి కరువై చితికిపోయిన వేలాది కుటుంబాలు.. ప్రత్యక్షంగానో, పరోక్షంగానో ప్రతి ఒక్కరిపై కొవిడ్-19 తీవ్ర ప్రభావమే చూపింది. వలస కార్మికుల జీవితాల్లో తీవ్ర విషాదమే నింపింది. కరోనా మహమ్మారి నివారణకు లాక్డౌన్ ఒక్కటే శరణ్యం కావడంతో అన్నీ మూతపడ్డాయి. ఇందులో భాగంగా గతేడాది మార్చి 22న జనతా కర్ఫ్యూతో మొదలై.. మార్చి 23 నుంచి 2020 మే చివరి వారం వరకు లాక్డౌన్ను పూర్తిస్థాయిలో అమలు చేశారు. ఏడాది క్రితం ప్రతి ఒక్కరికీ అనుభవమైన కనీవినీ ఎరుగని ఉపద్రవాన్ని పీడకలలా గుర్తుంచుకోక తప్పని దుస్థితి. ప్రస్తుతం కరోనా నివారణ టీకా అందుబాటులోకి వచ్చినా.. మహమ్మారి ప్రభావం ఇంకా పూర్తిగా తొలగిపోలేదు.
చైనాలో పురుడుపోసుకొని ప్రపంచదేశాలను ఇప్పటికీ గడగడలాడిస్తూ కంటిమీద కునుకులేకుండా చేస్తోంది కరోనా మహమ్మారి. సరిగ్గా ఏడాది క్రితం కంటికి కనిపించని ఈ మహమ్మారి మనుషుల ద్వారా దేశాలకు వ్యాప్తి చెందుతూ అనేక మంది ప్రాణాలను బలిగొన్నది. పిల్లా పాపలు అనే తేడా లేకుండా అప్పుడే పుట్టిన పసిగుడ్డుకు కూడావైరస్ సంక్రమించింది. మందేలేని మాయదారి రోగం నుంచి అనేక ఆటుపోట్లతో ప్రాణాలు బతికించుకుని బయటపడడమే గొప్ప కార్యంగా ప్రతి మనిషి బిక్కుబిక్కుమంటూ బతికాడు. కరోనాకు అడ్డుకట్ట వేయడానికి భౌతిక దూరమే ప్రామాణికంగా యావత్ ప్రపంచ దేశాలు లాక్డౌన్తో తమను తాము తాళాలు వేసుకున్నాయి. ఇందులో భాగంగా మార్చి 22న జనతా కర్ఫ్యూతో మొదలైన సెల్ఫ్ దిగ్బంధనం.. మార్చి 23న లాక్డౌన్ అమలుతో రాష్ట్రంలో అటు దేశంలో సర్వం మూత పడ్డాయి. ఎక్కడి వారు అక్కడే నిలిచి పోయారు. అనేక రంగాలు స్తంభించాయి. విమానాలు ఆగాయి. బస్సు చక్రాలు బంద్ అయ్యాయి. పరిశ్రమలు మూత పడ్డాయి. మొత్తం వ్యవస్థే కుప్పకూలే దుస్థితి. ఇలా ఒకటి కాదు రెండు కాదు… ఏకంగా రెండున్నర నెలల పాటు మానవ సమాజం ఎదుర్కొన్న గడ్డు కాలం ఇప్పుడిప్పుడే మరిచిపోయే పరిస్థితి కూడా లేదు. ఏడాది క్రితం ప్రతి ఒక్కరికీ అనుభవమైన కనీవినీ ఎరుగని ఉపద్రవాన్ని పీడకలలా గుర్తుంచుకోక తప్పని దుస్థితి.
అపోహలు లేకుండా టీకా..
ఏడాది కాలంగా కరోనా మహమ్మారి నుంచి రక్షణ కోసం చూస్తున్న రోజులు ఇప్పుడు ఫలించడంతో ప్రజలంతా ఊపిరి పీల్చుకుంటున్నారు. కొవిడ్ -19 టీకా ప్రజలకు అందుబాటులోకి రావడంతో భయం నుంచి బయటపడుతున్నారు. వ్యాక్సిన్ వచ్చేయడంతో ప్రజల్లో ఆరోగ్య భద్రత కలుగుతున్నది. ఇమ్యూనిటీ పెంచుకునే పద్ధతులే తప్ప కరోనాను నాశనం చేసే మందులు లేకపోవడంతో ప్రతి ఒక్కరూ పడిన భయాలకు కరోనా టీకాతో చెక్ పడింది. ప్రభుత్వం అన్ని జాగ్రత్తలు తీసుకుని క్లినికల్ చర్యల అనంతరం సురక్షితమని నిర్ధారించిన కొవిడ్ 19 టీకాను విడుదల చేసింది. మనిషి ప్రాణాలకు రక్షణగా నిలిచే విధంగా వ్యాక్సిన్ను ఉత్పత్తి చేసి అందిస్తున్నారు. సాధారణ ప్రజలు మాత్రం టీకా తీసుకునేందుకు కాసింత తటపటాయిస్తున్నారు. అవకాశం, అవగాహన ఉన్న వారు కొవిన్ యాప్లో పేరు నమోదు చేసుకుంటున్నారు. లేని వారు, నేరుగా ఏదేని గుర్తింపు కార్డుతో కేంద్రాలకు వచ్చి పేరు నమోదు చేసుకోవచ్చు. లేదా తెలిసిన వారితో కూడా ఆన్లైన్లో నమోదు చేయించుకోవచ్చు. దీర్ఘకాలిక రోగాలతో బాధపడుతున్న 45 నుంచి 59 ఏళ్ల వయసు వారు గుర్తింపు పొందిన వైద్యుడి నుంచి ధ్రువపత్రం పొందాల్సి ఉంటుంది. 60ఏండ్లు పైబడిన వారు టీకా కోసం సెంటర్కు వెళ్లొచ్చు. గర్భిణులు, పాలిచ్చే తల్లులు మినహా మిగతా 45ఏండ్లు పైబడిన వారంతా తీసుకోవచ్చు. మద్యం అలవాటు ఉన్న వారు టీకా తీసుకోవచ్చు. కానీ తాగి ఉన్న సమయంలో తీసుకోరాదు.
భయం నుంచి నిర్లక్ష్యంలోకి…
గతంలో కరోనా కట్టడిలో వైద్యారోగ్య శాఖ అధికారులతో పాటు మిగిలిన అన్ని శాఖల అధికారుల సమన్వయం స్పష్టంగా కనిపించేది. కొంత కాలంగా అలాంటి పరిస్థితులు ఎక్కడా కనిపించడం లేదు. దవాఖానల్లో కరోనా నిర్ధారణ అయిన వారిని నేరుగా ఇంటికి పంపించేసి హోం ఐసోలేషన్లో ఉండాలని సూచిస్తున్నారు. ఆ సమీప ప్రాంతాల్లో ఎలాంటి పారిశుద్ధ్య, ముందస్తు జాగ్రత్త చర్యలు చేపట్టడం లేదు. బాధితుల విషయంలో ఎలాంటి పర్యవేక్షణ ఉండడం లేదు. దీంతో కొందరు బాధితులు జనసమ్మర్ధ ప్రాంతాల్లో సంచరించి వైరస్ వ్యాప్తికి కారణమవుతున్నారు. అనుమానిత, లక్షణాలున్న వారి కుటుంబాలకు కేవలం వైద్య శాఖ కిందిస్థాయి సిబ్బందిని మాత్రమే పంపుతోంది. బాధితుల గుర్తింపులో గతంలో ఉన్న పకడ్బందీ చర్యలు ఇప్పుడు లేవనే చెప్పాలి. భౌతిక దూరం, మాస్కులు ధరించడం, శానిటైజ్ చేసుకోవడం వంటి అంశాలు పాటిస్తున్నారో లేదో చూసే అధికారుల పర్యవేక్షణ తీసికట్టుగా మారింది. వైరస్ ప్రభావం తీవ్రత తగ్గిందనే అభిప్రాయంతో కొందరు స్వీయ జాగ్రత్తలు పాటించడం మానేశారు.బ్యాంకులు, హోల్సేల్ దుకాణాలు, వస్త్ర దుకాణాలు, హోటళ్లు, రెస్టారెంట్లు, ఎక్కడ చూసినా నిబంధనల ఉల్లంఘన కొనసాగుతోంది. గ్రామీణ ప్రాంతాల్లో శుభ కార్యాలకు పెద్ద ఎత్తున బంధు మిత్రులను ఆహ్వానిస్తూ వైరస్ వ్యాప్తికి కారణం అవుతున్నారు.
ఆ నలుగురూ కరువే..
కరోనా ఉధృతి తొలి నాళ్లలో మనుషుల మధ్య దూరం పెరిగింది. తాకితేనే మాయదారి రోగం అంటుకునే పరిస్థితిలో ఎవరు ఎవరినీ నమ్మని విపత్కర పరిస్థితి. ఆయా కుటుంబాలను కరోనా వైరస్ ఛిద్రం చేసింది. వైరస్ సోకిన వారిని దూరం పెట్టడం మూలంగా వారు అనుభవించిన క్షోభ మామూలుది కాదు. వైరస్తోనే చనిపోతే దీనమైన పరిస్థితిలో అంత్యక్రియలు. మనిషి పార్థివదేహాన్ని మనుషులు మోసే అవకాశం లేని గడ్డు కాలాన్ని కరోనా కండ్ల ముందు నిలిపింది. జేసీబీ సాయంతో ఒంటరి దేహాలను పూడ్చి వేయడం తప్ప దహన సంస్కారాలు, చివరి చూపులకు ఆస్కారమే లేదు. ఎంతటి బంధుత్వమైనా, రక్త సంబంధమైనా కడసారి చూపులకు దిక్కూమొక్కూ లేకుండా చేసిందీ కరోనా వైరస్. ఇలా కంటికి కనిపించని వైరస్ ప్రతి ఒక్కరినీ గడగడలాడించింది. కొవిడ్ -19 ధాటికి కుటుంబాలు బిక్కుబిక్కుమంటూ కాలం గడిపాయి. లాక్డౌన్ అమలైన కాలంలో దగ్గు, తుమ్ము, తలనొప్పి, జ్వరం, జలుబు వంటి సమస్యలు ఏ ఒక్కరిలో కనిపించినా కిలో మీటరు దూరం పారిపోయే భయానక కాలమది. ఒకవేళ వైరసే అంటుకుంటే కుటుంబం అంతా కుదేలయ్యింది. కరోనా లక్షణాలా? కాదా? అని తేల్చుకోలేక మానసికంగా నరకం అనుభవించాయి. పాజిటివ్ కేసులు నమోదైన ఇండ్లలో వాతావరణం మరింత గందరగోళం. ఇలా నాటి చేదు జ్ఞాపకాలు గుర్తు చేసుకుంటే లాక్డౌన్ కాలమంతా ఓ బాధాతప్త భయానక స్థితికి తార్కాణం.
కన్నీళ్లకే కన్నీళ్లు..!
కరోనా ఆడుతున్న ఆటలో ఎంతో మంది సమిధలయ్యారు. ఆయా కుటుంబాల్లో విషాదం పెను ఉప్పెనలా మారింది. బతుకు చిత్రం చితికిపోయి కన్నీళ్లకే కన్నీరొచ్చే ఉదంతాలు వెలుగు చూశాయి. పాడే మోసేవారు లేక చివరికి అనాథ శవంలా అంత్యక్రియలు చేపట్టే దుస్థితి ఏర్పడింది. కొవిడ్ -19 మృతుల దహన సంస్కారాలపై తీవ్ర ప్రభావం చూపింది. కొన్ని శ్మశాన వాటికల్లో ఊహించని ఇబ్బందులు ఎదురయ్యాయి. కొందరు నిర్వాహకులు అంత్యక్రియలు జరిపేందుకు వీలు లేదని వెనక్కి పంపారు. వారిని ఒప్పించేందుకు ఇబ్బందులు పడాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. ఆఖరి తంతు ముగిసే వరకు బంధువులు పడిన ఇబ్బందులు వర్ణనాతీతం. కరోనాతో వ్యక్తి మరణించినట్లు నిర్ధారించాక వైద్యులు బాధిత కుటుంబ సభ్యులకు సమాచారం ఇవ్వడం… కేవలం ఐదుగురు మాత్రమే రావాలన్న ప్రభుత్వ నిబంధనలను గుర్తు చేసుకుంటే తరుక్కుమనే పరిస్థితి ఎదురవుతోంది. 2020 మార్చి 23 నుంచి 2020 మే చివరి వారం వరకు అమలైన లాక్డౌన్ ప్రజలకు నూతన పాఠాలు నేర్పింది. ఇంటి పట్టునే ఉండడంతో కొత్త ఆలోచనలను రేకెత్తించింది. మనిషి జీవితంలో దాగి ఉన్న మర్మాన్ని వైరస్ వివరించింది. ఇతరులకు సాయం చేయడం, వృథా తగ్గించడం, పొదుపు పాటించడంతో పాటు, గడ్డు పరిస్థుతులు ఎదురైనా తట్టుకునే మానసిక ైస్థెర్యాన్ని పెంపొందించుకునేలా లాక్డౌన్ నేర్పింది. వాహనాలను బయటికి తీయక, ఎదుటి వారితో పోటీ పడుతూ గమ్యాన్ని చేరేందుకు ఉరకలు వేసే పాదాలు నిలవడంతో మర మనిషి నుంచి సాధారణ మనిషి జీవితాన్ని అందరూ ఆస్వాదించారు. తెల్లవారు జామునే లేచి ఉపాధికి వెళ్లే వేతన జీవులు గుమ్మం దాటే సాహసం చేయక… వయో భారం లేకుండా పిల్లలు, పెద్దలు సమానమే అనేంతగా ఇంట్లోనే కాలక్షేపంగా రెండున్నర నెలల లాక్డౌన్ కొనసాగింది.