న్యూఢిల్లీ: పెగాసస్ వ్యవహారంపై చర్చ చేపట్టాలని ఇవాళ రాజ్యసభలో విపక్షాలు ఆందోళన చేపట్టాయి. జీరో అవర్ ప్రారంభం కాగానే ప్రతిపక్ష సభ్యులు ప్లకార్డులతో వెల్లోకి ప్రవేశించారు. నినాదాలు హోరెత్తడంతో చైర్మెన్ వెంకయ్య సభను 12 గంటలకు వాయిదా వేశారు. సభ ప్రారంభం కాగానే.. ధోలావీరాను ప్రపంచ వారసత్వ సంపదగా ప్రకటించినట్లు వెంకయ్య తెలిపారు. కేంద్ర మంత్రి మురళీధరన్.. ట్రాన్స్పోర్ట్, టూరిజంకు సంబంధించిన స్టాండింగ్ కమిటీ నివేదికను ప్రవేశపెట్టారు.
ఇవాళ ఉదయం పార్లమెంట్లో ప్రతిపక్ష పార్టీలకు చెందిన నేతలు భేటీ అయ్యారు. మల్లిఖార్జున్ ఖర్గే నేతృత్వంలో ఆ సమావేశం జరిగింది. పెగాసస్, రైతు చట్టాలు వంటి అంశాలపై ప్రభుత్వాన్ని నిలదీయాలని విపక్షాలు నిర్ణయించాయి. రాహుల్ గాంధీ కూడా ఆ భేటీలో పాల్గొన్నారు.
ద్రవ్యోల్బణం, పెగాస్, రైతు సమస్యలపై తాము వెనుదిరిగేది లేదని రాహుల్ అన్నారు. ఈ అంశాలపై సభలో చర్చ జరగాలన్నారు. పార్లమెంట్ కార్యక్రమాలను అడ్డుకుంటున్నట్లు ప్రభుత్వం ప్రతిపక్షాలను నిందిస్తోందన్నారు.