నిర్మల్, ఆదిలాబాద్, ఆసిఫాబాద్లలో డయాగ్నోస్టిక్ సెంటర్లు
57 రకాల పరీక్షలు.. 24 గంటలు వైద్య సేవలు..
ట్రయల్ రన్ సక్సెస్.. పీహెచ్సీల్లో ప్రతి రోగి ప్రొఫైల్..
ఆదిలాబాద్, నిర్మల్ జిల్లాల్లో 9న, ఆసిఫాబాద్లో త్వరలో ప్రారంభం
ఆదిలాబాద్, జూన్ 6(నమస్తే తెలంగాణ ప్రతినిధి) : సర్కారు దవాఖానకు వచ్చే పేదలకు మెరుగైన వైద్యసేవలు అందించడంలో భాగంగా ఆదిలాబాద్, నిర్మల్, కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాల్లో రోగ నిర్ధారణ పరీక్ష కేంద్రాల (డయాగ్నోస్టిక్ సెంటర్స్)ను ఏర్పాటు చేసింది. ఒక్కో కేంద్రానికి రూ.30 లక్షలు వెచ్చించి నిర్మించిన సెంటర్లో 57 రకాల వైద్యపరీక్షల కోసం అవసరమైన యంత్రాలను అందుబాటులో ఉంచగా.. ట్రయల్ రన్ కూడా నిర్వహిస్తున్నారు. ఈ కేంద్రాల్లో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు వివిధ ఆరోగ్య సమస్యలతో వచ్చే వారి నుంచి శాంపిళ్లను సేకరించి డయాగ్నోస్టిక్ కేంద్రాలకు పంపిస్తా రు. ఈ కేంద్రంలో జిల్లా వైద్యాధికారితోపాటు నోడల్ అధికారి, ల్యాబ్ మేనేజర్, పది మంది ల్యాబ్అసిస్టెంట్లు, డాటా ఆపరేటర్లు ఉంటారు. ఫుల్లీ ఆటోమెటిక్ క్లినికల్ కెమిస్ట్రీ అనలైజర్, ఫుల్లీ ఆటోమెటిక్ ఇమ్యునోఅస్సే అనలైజర్, ఫైవ్ పార్ట్స్ సెల్కౌంటర్, ఎలీసా రీడర్ అండ్ వాషర్, ఫుల్లీ ఆటోమెటిక్ యూ రిన్ అనలైజర్, ఈసీజీ, 2డీ ఎకో, అల్ట్రాసౌండ్, డిజిటల్ ఎక్స్రే వంటి ఇమేజింగ్ ఆధునిక పరీక్షా యంత్రాలతో ల్యాబ్ టెక్నీషియన్లు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల నుంచి వచ్చిన శాంపిళ్లను పరీక్షించి ఫలితాలను వెల్లడిస్తారు. ఈ కేంద్రంలో కిడ్నీ, లివర్ పనితీరు, థైరాయిడ్, 2డీఏకో, సీబీపీ, బయాస్పీ కల్చర్, సిరం, బొక్కలకు సంబంధించిన పరీక్షలు, ఐజీజీ, ఐజీఎం లాంటి ఖరీదైన 57 రకాల వైద్య పరీక్షలు ఉచితంగా నిర్వహిస్తారు. రోగనిర్ధారణ అయిన వివరాలను ఎప్పటికప్పుడు ఆన్లైన్లో నమోదు చేయడంతోపాటు సంబంధిత రోగి సెల్ఫోన్కు సమాచారం పంపిస్తారు. రోగికి సంబంధించిన పూర్తి రిపోర్టు ప్రొఫైల్ సంబంధిత పీహెచ్సీలో అందుబాటులో ఉంచుకొని రోగికి కావాల్సిన వైద్య సహాయం అందిస్తారు.
పేదలకు మెరుగైన వైద్యం
ఆదిలాబాద్ జిల్లాలో 22, నిర్మల్లో 25, కుమ్రం భీం ఆసిఫాబాద్లో 20 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల నుంచి సేకరించిన శాంపిళ్లను డయాగ్నోస్టిక్ కేంద్రాలకు పంపి పరీక్షలు నిర్వహిస్తా రు. గంట వ్యవధిలో 5 వేల పరీక్షలు చేయగల సామర్థ్యం గల యంత్రాలను సర్కారు సమకూర్చింది. ఈ కేంద్రాలు 24 గంటలపాటు పనిచేస్తాయి. ఆదిలాబాద్, నిర్మల్ జిల్లాల్లో ఏర్పాటు చేసిన డయాగ్నోస్టిక్ కేంద్రాలను ఈ నెల 9న మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి ప్రారంభించనున్నారు. కుమ్రం భీం ఆసిఫాబాద్లో కూడా త్వరలో ప్రారంభించే అవకాశం ఉంది. ఇందుకో సం అధికారులు ఏర్పాట్లు చేశారు. ఆదిలాబాద్ రిమ్స్ సమీపం లో ఏర్పాటు చేసిన కేంద్రంలో ట్రయల్ రన్లో భాగంగా రోజూ 200 వివిధ రకాల పరీక్షలు నిర్వహిస్తున్నారు. వివిధ రూట్ల నుంచి నమూనాలు సాయంత్రం 4 గంటలకు డయాగ్నోస్టిక్ కేంద్రానికి చేరుకుంటున్నాయి. సెంటర్లోని ల్యాబ్ టెక్నీషియన్లు నమూనాలను పరిశీలించి రాత్రి 8 గంటలకు నివేదికలు తయారు చేస్తారు. ఆయా పీహెచ్సీల నుంచి వచ్చి శాంపిళ్ల రిపోర్టులు ఆన్లైన్లో పంపిస్తారు. నివేదికల ఆధారంగా ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల వైద్యులు బాధితులకు వైద్యం అందిస్తారు. ప్రస్తుత పరిస్థితుల్లో రోగ నిర్ధారణ పరీక్షలకు ప్రజలు ప్రైవేట్ డయాగ్నస్టిక్ కేంద్రాల్లో ఎక్కువ డబ్బులు వెచ్చించాల్సి వస్తున్నది. సర్కారు ఏర్పాటు చేసిన డయాగ్నోస్టిక్ కేంద్రాల్లో ఉచితంగా ఖరీదైన పరీక్షలు అందించనుంది. దీంతో పేదలకు సత్వరమే మెరుగైన వైద్య సేవలు అందనున్నాయి. త్వరలో సీటీ స్కాన్, ఎక్స్రే కూడా అందుబాటులోనికి రానున్నాయి.