చర్లపల్లి, జూలై 7 : ఉపాధి కోర్సుల పట్ల విద్యార్థులు ఆసక్తి చూపి, ప్రతిభ కనబర్చాలని ఉప్పల్ ఎమ్మెల్యే బేతి సుభాష్రెడ్డి పేర్కొన్నారు. చర్లపల్లి పారిశ్రామికవాడ ఫేజ్-2లోని కేంద్ర ప్రభుత్వ సెంట్రల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ పెట్రోకెమికల్స్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలాజీ(సీపెట్)లో బుధవారం నిర్వహించిన ఓపెన్ హౌస్ కార్యక్రమాన్ని గ్రేటర్ డిప్యూటీ మేయర్ మోతే శ్రీలతా శోభన్రెడ్డితో కలిసి ఎమ్మెల్యే ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అవసరాలకు అనుగుణంగా సీపెట్ సంస్థలో ఇస్తున్న శిక్షణను విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. రానున్న కాలంలో ప్లాస్టిక్ రంగానికి ఉజ్వల భవిష్యత్తు ఉన్నదని, ప్లాస్టిక్ రంగ కోర్సులను విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. సీపెట్లో శిక్షణ తీసుకున్న విద్యార్థులకు ఆయా సంస్థల్లో ఉద్యోగ అవకాశాలు కల్పించడంతో పాటు ఔత్సాహిక పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దేందుకు సీపెట్ సంస్థ ప్రతినిధులు కృషి చేయడం అభినందనీయమన్నారు. తెలంగాణ రాష్ట్ర విద్యార్థులు సీపెట్ కోర్సులను సద్వినియోగం చేసుకోవాలని, మూడు రోజుల పాటు నిర్వహించనున్న ఓపెన్ హౌస్లో విద్యార్థులు పాల్గొనాలని సూచించారు. అనంతరం డిప్యూటీ మేయర్ మోతే శ్రీలతాశోభన్రెడ్డి ప్రసంగించారు.