రామేశ్వరం : తమిళ సూపర్స్టార్ రజినీకాంత్ ఆధ్యాత్మిక రాజకీయాలకు మద్దతుగా నిలవాలని ఆ రాష్ట్ర విశ్వహిందూ పరిషత్ (వీహెచ్పీ) అధ్యక్షుడు ఎస్ వేదాంతం కోరారు. బుధవారం ఆయన రామేశ్వరంలో మీడియాతో మాట్లాడారు. రాజకీయాల్లో ఆధ్యాత్మిక విలువలు పాటించే పార్టీలకు తమిళ ప్రజలు ఈ ఎన్నికల్లో మద్దతుగా నిలవాలని కోరారు. ‘రానున్న ఎన్నికలు చాలా ముఖ్యమైనవి.. తమిళ రాజకీయాల్లో యోధులైన మాజీ ముఖ్యమంత్రులు జయలలిత, కరుణానిధి ఈ సారి ఎన్నికల్లో లేరు. తమిళనాడు ఆధ్యాత్మిక రాష్ట్రామా? కాదా నిర్ణయించే ఎన్నికలు ఇవని ఆయన పేర్కొన్నారు.
డీఎంకే నుంచి విడిపోయిన సొంత పార్టీ పెట్టిన ఎంజీఆర్ ఆధ్యాత్మిక రాజకీయాలను అనుసరించారని వేదాంతం అన్నారు. ఎంజీఆర్ తరచూ మూకాంబికా ఆలయానికి వెళ్లి భక్తిభావాన్ని చాటేవారని గుర్తుచేశారు. జయలలిత సైతం ఆధ్యాత్మికతను కొనసాగించారని, కానీ ప్రజల్లో ప్రచారం చేసుకోలేదని చెప్పారు. ‘రజినీకాంత్ ఆధ్యాత్మిక రాజకీయాలు అనుసరిస్తానని ఇప్పటికే ప్రకటించారు. ఆయనపై తమిళ ప్రజల్లో భారీ అంచనాలు ఉన్నాయి. అనారోగ్యం కారణంగా రజినీకాంత్ రాజకీయాల్లోకి రాలేకపోయారు. కానీ ఆయన ప్రస్తామించిన అంశాలు ప్రజలకు గుర్తున్నాయి’ అని వేదాంతం పేర్కొన్నారు.