అహ్మదాబాద్: రైలు పట్టాలపై ఒక మొసలి గాయపడి ఉండటాన్ని రైల్వే సిబ్బంది గమనించి స్టేషన్ సూపరింటెండెంట్కు సమాచారం ఇచ్చారు. దీంతో దానిని కాపాడేందుకు ఆ మార్గంలో ప్రయాణించే రాజధాని ఎక్స్ప్రెస్ను సుమారు అరగంట నిలిపివేశారు. గుజరాత్లోని వడోదర సమీపంలో ఈ ఘటన జరిగింది. వడోదర-ముంబై మార్గంలోని కర్జన్ రైల్వే స్టేషన్ సమీపంలో రైల్వే పట్టాలపై రైలు ఢీకొని గాయపడిన మొసలిని ట్రాక్ తనిఖీ సిబ్బంది మంగళవారం ఉదయం గమనించారు. ఈ విషయాన్ని కర్జన్ రైల్వే స్టేషన్ సూపరింటెండెంట్కు చెప్పారు. దీంతో ఆయన వన్యప్రాణుల సంరక్షణ సిబ్బందికి ఫోన్ చేశారు.
కాగా, ఆ సిబ్బంది వాహనంలో ఆ స్పాట్కు చేరేందుకు మార్గం లేదు. దీంతో వారు స్టేషన్కు వచ్చే వరకు వడోదర-ముంబై రాజధాని ఎక్స్ప్రెస్ను కర్జన్ రైల్వే స్టేషన్లో నిలిపి ఉంచారు. దీంతో ఆ సిబ్బంది రైలు ఎక్కి సంఘటనా స్థలానికి వెళ్లారు. పట్టాల మధ్యలో తలకు గాయమైన మొసలిని గమనించారు. దానిని పట్టాల పక్కకు చేర్చగా అక్కడ మరో ఐదు నిమిషాలు నిలిచిన రాజధాని ఎక్స్ప్రెస్ ముందుకు కదిలింది.
మరోవైపు ఎనిమిది అడుగుల పొడవైన ఆ మొసలి అనంతరం కొంతసేపటికే చనిపోయినట్లు వణ్యప్రాణుల సంరక్షణ కార్యకర్తలు హేమంత్, నేహా తెలిపారు. మరణించిన ఆ భారీ మొసలిని ఆ తర్వాత కిసాన్ రైలులో తరలించి కర్జన్ అటవీశాఖకు అప్పగించినట్లు స్టేషన్ సూపరింటెండెంట్ సంతోష్ శర్మ చెప్పారు. మరోవైపు ఈ ఘటన వల్ల ఆ మార్గంలో ప్రయాణించే రాజధాని ఎక్స్ప్రెస్ సుమారు 25 నిమిషాలు నిలిచిపోగా, మిగతా రైళ్లు సుమారు 45 నిమిషాలు ఆలస్యంగా నడిచాయి.